అక్షరటుడే, తాడ్వాయి: Urea App Protest | రైతుల సమస్యలపై పోరాడుతున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని, రైతులను అణచివేయాలనే ప్రయత్నాలు చేస్తే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ హెచ్చరించారు.
Urea App Protest | యూరియా యాప్ రద్దు చేయాలని డిమాండ్
పోలీస్ స్టేషన్ నుంచి మంగళవారం సాయంత్రం విడుదలైన అనంతరం తాడ్వాయి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
యూరియా యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించనున్న ధర్నాకు పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేయడాన్ని ఆయన ఖండించారు.
శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధమవుతుంటే బలవంతంగా అరెస్టు చేయడం నియంతృత్వ ధోరణికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని స్పష్టం చేశారు.
రైతులు తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నిస్తే గ్రామాల్లో పోలీసు బలగాలను మోహరించి అణచివేయడం గతంలో ఎన్నడూ చూడలేదన్నారు.
Urea App Protest | ప్రభుత్వంపై విమర్శ
ధర్నాలో పాల్గొనేందుకు వచ్చిన నాయకులు, కార్యకర్తలు, రైతులను పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు.
ఫర్టిలైజర్ సరఫరా కోసం ప్రవేశపెట్టిన యూరియా యాప్ వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రైతు సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారని, ప్రస్తుతం రైతుల సమస్యలు పెరిగాయని పేర్కొన్నారు. రైతుబంధు నిధుల విడుదలలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
అభివృద్ధి పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, గతేడాది వరదల్లో దెబ్బతిన్న లింగంపల్లి వంతెన నిర్మాణం ఇప్పటికీ పూర్తికాలేదని ఎమ్మెల్యే మదన్ మోహన్పై విమర్శలు గుప్పించారు.
వెంటనే యూరియా యాప్ను రద్దు చేసి రైతులకు అవసరమైన మేరకు యూరియా అందించాలని, లేనిపక్షంలో రైతులతో కలిసి మరో దఫా ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో తాడ్వాయి మండల కన్వీనర్ ముదం నర్సింలు, సొసైటీ ఛైర్మన్ కపిల్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పుల్గం సాయి రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంగారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.