అక్షరటుడే, ఎల్లారెడ్డి: Wet Paddy Procurement | తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనకుంటే రోడ్లను దిగ్బంధం చేస్తామని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ( Former MLA Jajala Surender) అన్నారు. నాగిరెడ్డిపేట (Nagireddy peta) మండలం గొలిలింగాల గ్రామంలో రెండు నెలల క్రితం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆయన సందర్శించారు.
Wet Paddy Procurement | రెండునెలలుగా క్రితం ప్రారంభించినా..
గొలిలింగాల గ్రామంలో రెణ్నెళ్ల క్రితం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ఇప్పటికీ ధాన్యం కొనుగోళ్లు పూర్తికాకపోవడంపై మాజీ ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షం కారణంగా ధాన్యం పూర్తిగా తడిసిపోయిందన్నారు. తడిసిన వడ్లకు మొలకలు వచ్చినా అధికారులు స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో పాలకులు, అధికారులు రైతుల ఉసురు పోసుకుంటున్నారన్నారు. రెండు నెలలుగా కొనుగోలు కేంద్రాల వద్దే కాపలా ఉంటున్నారని, అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని ఆయన వాపోయారు. తడిసిన ధాన్యాన్ని తేమ, తాలు పేరుతో తిరస్కరిస్తారేమోనని రైతులు భయపడుతున్నారన్నారు.
Wet Paddy Procurement | అసమర్థ పాలనతో రైతులు బేజారు..
అసమర్థ పాలనతో రైతులు బేజారవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజమమని ఆయన ప్రశ్నించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనే దిక్కు లేకుండా చేశారని మండిపడ్డారు. రాబోయే రెండు రోజుల్లో కల్లాల్లోని మొత్తం వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని (Grain Purchase), తడిసిన ప్రతి గింజకూ మద్దతు ధర చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని, అవసరమైతే జాతీయ రహదారిపై ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలు, రైతు సంఘం నాయకులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.



