అక్షరటుడే, వెబ్డెస్క్ : KTR Challenge Revanth | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి (CM Revanth Reddy) సవాల్ విసిరారు. హైదరాబాద్ నగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టినట్లు చూపించినా తాను రాజకీయాల్లో నుంచి తప్పుకుంటానన్నారు. దమ్ముంటే చూపించాలని సవాల్ చేశారు.
కూకట్పల్లి (Kukatpally) నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్పై విమర్శలు చేశారు. నగరంలో కొత్తగా ఒక్క ఇల్లు కట్టలేదన్నారు. కానీ హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం మొత్తం కాంగ్రెస్ దరిద్రాన్ని వదిలించుకుందని, మనం కూడా వదిలించుకోవాలన్నారు.
KTR Challenge Revanth | 24 గంటల తాగునీరు
రాష్ట్రంలో తాము అధికారంలో ఉన్నప్పుడు 24 గంటల విద్యుత్ ఇచ్చినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచి కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని చెప్పారు. అప్పుడు హైదరాబాద్ (Hyderabad) నగరంలో 24 గంటల తాగునీటి సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యం అంటే.. ఇండ్లు కూలగొట్టే రాజ్యం, హైడ్రా పేరిట అరాచకం చేసే రాజ్యం అని ఎద్దేవా చేశారు. హైడ్రా వాళ్లు తన ఇంటికి నోటీసులు అంటిస్తే.. ఇల్లు కూల్చేస్తారన్న భయంతో బుచ్చమ్మ అనే మహిళ తన కూతురి ఇంటికెళ్లి ఆత్మహత్య చేసుకుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
KTR Challenge Revanth | అబద్ధపు హామీలతో..

కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ విమర్శించారు. రైతు భరోసా రూ.15 వేలు చేస్తామని చెప్పారని, కానీ ఇప్పుడు రూ.12 వేలు కూడా వేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్లు పెంచుతామని చెప్పి ఇప్పడు మాట్లాడటం లేదన్నారు. హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ప్రజలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ నగరంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని కేటీఆర్ తెలిపారు. తాము చేపట్టిన పనులకు నేడు సీఎం రేవంత్రెడ్డి రిబ్బన్ కట్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తాగునీటి సమస్య పరిష్కరించామన్నారు. బీఆర్ఎస్ హయాంలో భూముల ధరలు భారీగా పెరిగాయన్నారు. కానీ కాంగ్రెస్ రాగానే రియల్ ఎస్టేట్ పడిపోయిందని పేర్కొన్నారు. హైదరాబాద్ నగర ప్రజలు కాంగ్రెస్ను నమ్మలేదన్నారు. కానీ గ్రామీణ ప్రజలు కాంగ్రెస్ మాయమాటలు నమ్మి ఓట్లు వేశారన్నారు.
ఇది కూడా చదవండి..: Harish Rao Fire | రైతుల పాలిట శాపంగా కాంగ్రెస్ పాలన: హరీశ్రావు


