Revanth Reddy Challenge | మోటార్లకు మీటర్లు పెడితే పోటీ చేయం..బీఆర్ఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Revanth Reddy Challenge | తెలంగాణ రాజకీయాల్లో విద్యుత్ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య సవాల్-ప్రతిసవాల్ పర్వం మొదలైంది. అన్నదాతలకు మోటార్లకు మీటర్లు పెట్టినా, ఉచిత కరెంట్ సరఫరాను ఆపేసినా తాము భవిష్యత్తు ఎన్నికల్లో పోటీ చేయబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy) సంచలన ప్రకటన చేశారు. ఒకవేళ తమ ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ను నిరంతరాయంగా కొనసాగిస్తే.. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటుందా? అని ఆయన సవాల్ విసిరారు. రైతుల పేరు చెప్పుకుని మాజీ సీఎం కేసీఆర్ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Revanth Reddy Challenge | జవాబుదారీతనం కోసమే ‘రైతు డిస్కం’..

రైతాంగానికి 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన కరెంట్ అందించేందుకే ప్రత్యేకంగా ‘రైతు డిస్కం’ను తీసుకువస్తున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్ వినియోగాన్ని దీనికి అనుసంధానించడం ద్వారా వ్యవస్థలో జవాబుదారీతనం మరింత పెరుగుతుందని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల భారాన్ని తాము మోస్తున్నామని.. తాము ఏడాదికి రూ. 70 వేల కోట్ల అప్పు చేస్తుంటే, పాత అప్పుల కోసం ఏకంగా రూ. 95 వేల కోట్లు చెల్లిస్తున్నామని వివరించారు. ఈ వాస్తవాలను హరీశ్‌రావు ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులకు లోబడే రూ. 54 వేల కోట్ల రుణాలు సేకరిస్తామని తాము ముందే ప్రకటించామని సీఎం గుర్తుచేశారు.

revanth.2 1

Revanth Reddy Challenge | కేటీఆర్ బినామీ సంస్థపై ఆరోపణలు..

బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తానే ఎప్పటికీ బీఆర్ఎస్‌లోనే ఉంటానని కేసీఆర్ మీద ఒట్టేసి హరీశ్‌రావు చెప్పగలరా అని ప్రశ్నించారు. గతంలో ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కలిసిన ఉదంతాన్ని గుర్తు చేస్తూ.. ప్రస్తుతం ఆయన ఎవరెవరితో సంప్రదింపులు జరుపుతున్నారో తనకు పూర్తి సమాచారం ఉందన్నారు. ఇటీవల పార్టీ కీలక సమావేశాన్ని వదిలిపెట్టి హరీశ్‌రావు అత్యవసరంగా ఢిల్లీకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని నిలదీశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అంతర్గతంగా కలిసిపోతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. అలాగే ఇంటర్ బోర్డు జవాబు పత్రాల తారుమారు వ్యవహారంలో గతంలో వార్తల్లోకి వచ్చిన గ్లోబరీనా సంస్థ.. కేటీఆర్ బినామీ కంపెనీయేనని ఆరోపించారు.

revanth.3

Revanth Reddy Challenge | 2034 వరకు రాష్ట్ర రాజకీయాల్లోనే..

రాష్ట్రంలో పండుతున్న ధాన్యంలో కేంద్ర ప్రభుత్వం కేవలం 32 శాతం మాత్రమే సేకరిస్తోందని, వడ్ల కొనుగోలులో బీజేపీ సర్కారు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. దీనికి నిరసనగా బీజేపీ నాయకుల ఇళ్ల ముందే ధాన్యం కుప్పలు పోస్తామని హెచ్చరించారు. ప్రాణహిత ప్రాజెక్టు వివాదాల పరిష్కారం కోసం తాము ప్రయత్నిస్తుంటే.. మహారాష్ట్ర సీఎం తమకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక తన రాజకీయ భవిష్యత్తుపై స్పందిస్తూ.. తాను 2034 వరకు తెలంగాణ రాజకీయాల్లోనే క్రియాశీలకంగా ఉంటానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో తన కాంబినేషన్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోందని, రాబోయే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. లెజెండరీ నటుడు ఎన్టీఆర్‌ను కులం, ప్రాంతం పరిధిలోకి లాగడం మూర్ఖత్వమేనని కొట్టిపారేశారు.

ఇది కూడా చదవండి: DK Shivakumar CLP Leader | కర్ణాటక సీఎల్పీ లీడర్​గా డీకే శివకుమార్​

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *