అక్షరటుడే, కామారెడ్డి: Indupriya Troll Allegations | తనపై ట్రోలింగ్ చేస్తే సహించేది లేదని కామారెడ్డి మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ వార్నింగ్ ఇచ్చారు. ఉదయం నుంచి సోషల్ మీడియా వేదికగా తనపై జరుగుతున్న ట్రోలింగ్ వెనక షబ్బీర్ అలీ ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Indupriya Troll Allegations | తనపై అసభ్యకరంగా..
తనపై అసభ్యకరంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారంటూ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra)కు శుక్రవారం సుమారు 30 మంది మహిళలతో కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఉదయం నుంచి షబ్బీర్ అలీ అన్న కొడుకు షేరు నాపై అసభ్యంగా ట్రోల్ చేస్తున్నారని, మాటల్లో చెప్పలేని పదాలతో ట్రోల్ చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. షబ్బీర్ అలీని ఉద్దేశించి ‘‘ఇంకెన్ని రోజులు మీ అరాచకాలు సాగిస్తారు.. మీకు పని చేయడం చేతకాదు.. చేసే వారిని చేయనివ్వడం లేదు.. పని చేస్తూ యాక్టివ్గా ఉన్నవాళ్లను టార్గెట్ చేస్తారా’ అని ప్రశ్నించారు.
Indupriya Troll Allegations | రాహుల్, సీఎం మహిళలను ప్రోత్సహిస్తుంటే..
రాహుల్ గాంధీ (Rahul Gandhi), సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)యువత సేవాభావంతో ముందుకు రావాలని, మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని మోటివేట్ చేస్తుంటే ఇక్కడ మాత్రం ట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు. తాను వైస్ ఛైర్ పర్సన్గా, ఛైర్పర్సన్గా ప్రస్తుతం యువ నాయకురాలిగా వృద్ధ మహిళలకు చేయూతనిస్తున్నానని, ఎవరైనా చనిపోతే జీసీఆర్ ట్రస్ట్ ద్వారా అంత్యక్రియలకు ఆర్థికసాయం అందిస్తున్నామన్నారు., పేదింటి ఆడబిడ్డలకు పుస్తెమట్టెలు అందిస్తున్నామని, ఇటీవల జాబ్ మేళాతో ఉద్యోగాలు కల్పించామని, ఇందిరమ్మ లబ్ధిదారులకు వంట సామగ్రి అందిస్తున్నామని వివరించారు. ‘మీరు రాజకీయాలు చేసుకోండి, చేతనైన సహాయం చేయండి, మీరు చేయరు, చేసే వాళ్ళను టార్గెట్ చేస్తారా..?’ అని నిలదీశారు.
Indupriya Troll Allegations | కామారెడ్డిలో కాంగ్రెస్ నాశనానికి కారణం షబ్బీర్అలీ..
సీనియర్ నాయకుడిగా చెప్పుకునే మీరు ఇలాగేనా చేసేదని, కామారెడ్డిలో కత్తుల దాడికి కారణమైన వారిని వెంటేసుకుని తిరుగుతున్నారని ఆరోపించారు. గత పన్నెండేళ్లుగా ఆయన కనిపించలేదని, మళ్లీ వచ్చినప్పటి నుంచి అరాచకాలు మొదలయ్యాయని, ఒక హిందూ మహిళగా తనను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. షబ్బీర్ అలీ అన్న కొడుకు షేరు, ఆయన కొడుకు ఇలియాస్, షేక్ ముక్తార్ అనే వ్యక్తుల ద్వారానే ఈ ట్రోలింగ్ జరుగుతోందని ఆరోపించారు. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీని నాశనం చేసిన ఏకైక వ్యక్తి షబ్బీర్ అలీ (Shabbir Ali) అని విమర్శించారు. ఇటీవల వైరల్ అయిన ఆడియోలో పీసీసీ చీఫ్, పార్టీ పట్ల, మహిళల పట్ల చేసిన వ్యాఖ్యలు సరికాదని, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్పై అనుచిత వ్యాఖ్యలు చేసేది ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Indupriya Troll Allegations | ప్రభుత్వ సలహాదారుడిగా ఉండి..
ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉండి ఆడబిడ్డలపై అనుచిత వ్యాఖ్యలు చేయాలని సలహాలు ఇస్తున్నారా అని నిలదీశారు. రాజకీయాల్లో షబ్బీర్ అలీ అన్ ఫిట్ అని, ఆయనకు ప్రభుత్వ సలహాదారుగా కొనసాగే అర్హత లేదని, ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు పార్టీలో ఉంటే పార్టీకి నష్టమని అన్నారు. తనను ఎంత ఇబ్బంది పెట్టినా ఇంకా ముందుకు సాగుతానని, సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని, ఇలాంటి వ్యక్తులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఖబడ్దార్ షబ్బీర్ అలీ.. నీ సంగతి చూస్తాం అని హెచ్చరించారు. తమ ఫిర్యాదుపై సరైన న్యాయం జరుగుతుందని నమ్ముతున్నామని, లేకపోతే రాష్ట్ర మహిళా కమిషన్, క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి..: Quality Seeds Supply | రైతులకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయాలి
