అక్షరటుడే, వెబ్డెస్క్: Kamareddy police controversy | కామారెడ్డి పట్టణంలో ఇటీవల సంచలనం సృష్టించిన ఐదేళ్ల బాలుడి హత్య కేసులో పోలీసుల వ్యవహారశైలిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం చర్చకు దారితీసింది. ఈ నెల 18న జరిగిన ఈ దారుణ ఘటనలో బాలుడిని తల్లి, ఆమె ప్రియుడు కలిసి హత్య చేశారు.
ఈ కేసులో పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసి జైలుకు తరలించారు. అయితే, ఈ కేసులో బాలుడి తండ్రి నుంచి ఫిర్యాదు స్వీకరించకుండా, తల్లి తరఫు బంధువుల నుంచి ఫిర్యాదు తీసుకోవడం విమర్శలు ఉన్నాయి.
Kamareddy police controversy | అవమానించారని..
ఈ నేపథ్యంలో బాలుడి తండ్రి భాస్కర్ స్వగ్రామమైన ఆర్గొండ సర్పంచి విక్రాంత్ రెడ్డి కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. తండ్రి నుంచి ఫిర్యాదు లేదా వాంగ్మూలం తీసుకోవాలని సర్పంచి కోరగా.. సీఐ నరహరి తనతో అవమానకరంగా ప్రవర్తించారని సదరు సర్పంచి ఆరోపించారు.
అంతేకాకుండా, తాను ఫోన్లో సంభాషణను రికార్డు చేస్తున్నానన్న కారణంతో తన ఫోన్ను లాక్కొని ముగ్గురు కానిస్టేబుళ్లు తనపై దాడి చేశారని ఎస్పీకి సర్పంచి ఫిర్యాదు చేశారు. ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న తనను అవమానించడమే కాకుండా దాడి చేశారని, సంబంధిత సీఐతోపాటు కానిస్టేబుళ్లపై తక్షణ చర్యలు తీసుకోవాలని సర్పంచి కోరారు.
Kamareddy police controversy | సీఐ ఖండన..
అయితే, ఈ ఆరోపణలను సీఐ నరహరి ఖండించారు. తాను తప్పు చెయ్యలేదని, సర్పంచిపై కానిస్టేబుళ్లు దాడి చేయలేదని ఆయన వివరణ ఇచ్చారు. కాగా, ఈ ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు వెళ్లడంతో, ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేసు దర్యాప్తుతో పాటు పోలీసుల వ్యవహారంపై కూడా విచారణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Vijayawada college harassment | ఆయుర్వేద కళాశాలలో లైంగిక వేధింపుల కలకలం
ఇది కూడా చదవండి: Indian Woman Speech | ‘మతాన్ని మార్చం.. మనసులను గెలుస్తాం!’ టెక్సాస్ కౌన్సిల్ హాల్లో ప్రతిధ్వనించిన భారతీయ గళం

