అక్షరటుడే, కామారెడ్డి : Lucky Draw Scam | లక్కీడ్రా ద్వారా భూమి విక్రయిస్తానని సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వ్యక్తిపై సదాశివనగర్ పోలీసులు (Sadashivanagar) కేసు నమోదు చేశారు. ఈ మేరకు శనివారం వివరాలు వెల్లడించారు.
Lucky Draw Scam | 19 గుంటల భూమి..
సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన సింగరాయపల్లి రమేష్ తనకు సర్వే నెం.108/1/2లో ఉన్న 19 గుంటల పట్టా భూమిని లక్కీడ్రా ద్వారా విక్రయిస్తానని చెబుతూ ఒక్కో వ్యక్తి నుంచి రూ.999 వసూలు చేసి రశీదులు జారీ చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం చేరింది. రంగంలోకి దిగిన సదాశివనగర్ ఎస్సై పుష్పరాజ్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేయగా, ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే లక్కీడ్రా స్కీం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అనుమతి పత్రాలు చూపాలని కోరగా అవి లేవని రమేష్ అంగీకరించాడు.
దీంతో పోలీసులు లక్కీడ్రాకు సంబంధించిన 6 పుస్తకాలు, ఒక సెల్ఫోన్ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రూ.999 చెల్లిస్తే భూమి వస్తుందని, చిన్న పెట్టుబడితో భారీ లాభాలు అని చెప్పే అనుమతి లేని లక్కీడ్రాలు, స్కీమ్లు అన్నీ చట్టవిరుద్ధమని ఎస్పీ హెచ్చరించారు. ఇలాంటి మోసపూరిత ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, డబ్బు చెల్లించే ముందు తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతులు ఉన్నాయో లేదో పరిశీలించాలని సూచించారు. అలాగే ఇలాంటి కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఇది కూడా చదవండి : భారత జట్టులోకి వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ