Medigadda Collapse | కేసీఆర్​ నిర్లక్ష్యంతోనే మేడిగడ్డ కూలింది : సీఎం రేవంత్​రెడ్డి

కేసీఆర్​ నిర్లక్ష్యంతోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని సీఎం రేవంత్​రెడ్డి ఆరోపించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Medigadda Collapse | కేసీఆర్‌ సాగునీటి శాఖమంత్రిగా ఉన్నప్పుడే మేడిగడ్డ లోపాలు బయటపడ్డాయని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. ఆయన నిర్లక్ష్యంతోనే మేడిగడ్డ కుప్పకూలిందన్నారు.

కన్నెపల్లి పంప్​హౌజ్​ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోయాలని ఇటీవల బీఆర్​ఎస్​ నాయకులు డిమాండ్​ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో సీఎం రేవంత్​రెడ్డి మీడియా సమావేశంలో వారికి కౌంటర్​ ఇచ్చారు. 2022 జులై 14న వరద వస్తే కన్నెపల్లి పంపుహౌస్‌ దెబ్బతిన్నదని చెప్పారు. దాన్ని సరిదిద్దకపోవడంతో.. ఇప్పటికీ పంపుహౌస్‌ వినియోగంలోకి రాలేదన్నారు.

Medigadda Collapse | ఈటల గౌరవం పొగొట్టుకున్నారు

బీఆర్‌ఎస్‌ వాదననే బీజేపీ నేత ఈటల చెబుతున్నారని సీఎం అన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలు గోదావరి నీళ్లు ఎత్తిపోయాలని, ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈటల అంటే తమకు తక్కువ అభిప్రాయం లేదని, కానీ ఆయన మాటలు గౌరవించే పరిస్థితి లేదన్నారు. హరీష్‌రావు చెప్తే ఈటల మాట్లాడారని ఆరోపించారు. ఆయన గౌరవం పోగొట్టుకున్నారన్నారు. ఎన్​డీఎస్​ఏ నివేదిక ప్రకారం గేట్లు మూయొద్దన్నారు. కాళేశ్వరంలో మేడిగడ్డ వెన్నుపూస అని, ఎల్లంపల్లి గుండెకాయ అన్నారు. కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తడానికి లేదని చెప్పారు.

Medigadda Collapse | సీబీఐ విచారణ ఏమైంది

ఈటల రాజేందర్​ ముందు సీఎం రెండు డిమాండ్లు ఉంచారు. ఎన్​డీఎస్​ఏను కలిసి నీళ్లు ఎత్తిపోయాలని చెప్పించాలన్నారు. అప్పుడు తాము సంపూర్ణంగా సహకరిస్తామని తెలిపారు. సీబీఐ వద్ద మూలుగుతున్న కాళేశ్వరం కేసుపై విచారణ ముందుకు తీసుకెళ్లేలా చేయాలని డిమాండ్​ చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలు, అవినీతి ఆరోపణలపై విచారణను సీబీఐకి అప్పగించినట్లు గుర్తు చేశారు. ఇప్పటికీ విచారణ ఎందుకు వేగంగా సాగడం లేదో బీజేపీ ఎంపీ ఈటల సమాధానం చెప్పాలన్నారు.

Medigadda Collapse | నీటి నిల్వకు అనుకూలం కాదు

డ్యామ్ సేఫ్టీ యాక్ట్-2021 ప్రకారమే ఎన్డీఎస్ఏ మేడిగడ్డను విజిట్ చేసిందని సీఎం తెలిపారు. 7వ బ్లాక్ దెబ్బతినడం వల్ల బ్యారేజీలో నీళ్లు నింపితే ప్రమాదమని ప్రాథమిక నివేదికలో చెప్పిందని, పది నెలల తర్వాత ఇచ్చిన తుది నివేదికలోనూ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నీటి నిల్వకు అనుకూలం కావని తేల్చిందన్నారు. కన్నెపల్లి పంప్ హౌజ్ ద్వారా లిఫ్ట్ చేయాలంటే కావాల్సిన పంపింగ్ లెవల్ 93.50 మీటర్లు కాగా ప్రస్తుతం 89.90 మీటర్లే ఉందని వివరించారు. కన్నెపల్లి నుంచి ఎత్తిపోసినా గేట్లు ఓపెన్ ఉండటంతో నీరు మళ్లీ మేడిగడ్డకు రావాల్సిందేనని, ఎన్డీఎస్ఏ సిఫారసు మేరకు గేట్లు క్లోజ్ చేసేందుకు వీల్లేదని చెప్పారు.

Medigadda Collapse | కిలాడీ కమిటీ

రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ సూచనలు పాటిస్తుంటే కేసీఆర్ వైపు నుంచి కిలాడీల కమిటీ ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు. అందులో కేసీఆర్ చైర్మన్, హరీష్, కేటీఆర్ సభ్యులుగా ఉన్నారని, ఇప్పుడు ఈటల కూడా చేరారని ఎద్దేవా చేశారు. చర్లపల్లి జైలుకు పంపితే వారు చేసిన అప్పులు, తప్పులు తెలుస్తాయన్నారు. హరీష్ రావును ఆనాడు కేసీఆర్ నమ్మలేదన్నారు. ఆంధ్రా సంస్థలైన నారాయణ, చైతన్యలను ఆనాడు విమర్శించిన హరీష్​రావు.. ఇప్పుడు వాటికి పాలు పోసి బతుకుతున్నారని అన్నారు.

దీనిని కూడా చదవండి : Shabad Murders Case | షాబాద్​ హత్యల కేసు.. ఎస్సై, సీఐల సస్పెన్షన్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *