అక్షరటుడే, భీమ్గల్: Vemula Prashanth Reddy | మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి నాయకత్వంలో భీమ్గల్(Bheemgal) ప్రాంతం గత పదేళ్లలో ప్రగతి సాధించిందని బీఆర్ఎస్(BRS) నాయకులు స్పష్టం చేశారు. భీమ్గల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
Vemula Prashanth Reddy | లింబాద్రి గుట్టకు శోభ తెచ్చింది ప్రశాంత్రెడ్డే..
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లింబాద్రి గుట్ట భూముల వివాదాస్పద ప్రక్రియను కోర్టు ద్వారా పరిష్కరించి గుట్ట అభివృద్ధికి శ్రీకారం చుట్టింది వేముల ప్రశాంత్రెడ్డి అని వారన్నారు. కాంగ్రెస్ నేతలు గుట్టపై గెస్ట్ హౌస్ కడతామనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రశాంత్రెడ్డి రూ. 4 కోట్ల వ్యయంతో గిరి ప్రదక్షిణ రోడ్డు, నాలుగు లైన్ల రహదారి, సెంట్రల్ డివైడర్, లైటింగ్ మంజూరు చేయించి గుట్ట రూపురేఖలను మార్చారని వివరించారు. క్షేత్రస్థాయికి రాకుండా, హైదరాబాద్ గాంధీభవన్లో కూర్చొని తప్పుడు ప్రచారాలు చేస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ నేత సునీల్రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
Vemula Prashanth Reddy | సీడీపీ నిధులు ఇవ్వకుండా విమర్శలా?
ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అభివృద్ధి నిధులు ఇస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, గత రెండేళ్లుగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డికి రావాల్సిన సీడీపీ (CDP) నిధుల్లో ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. నిధులు ఆపివేసి అభివృద్ధి జరగలేదనడం సిగ్గుచేటన్నారు. రూపాయి ఇవ్వకుండా మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులను భీమ్గల్ ప్రాంతంలో తిరగనివ్వబోమని హెచ్చరించారు.
Vemula Prashanth Reddy | కేసీఆర్ అప్పులతోనే ప్రాజెక్టులు, సంక్షేమం
కేసీఆర్ చేసిన అప్పులపై కాంగ్రెస్ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్లమెంట్లో ప్రధాని మోదీ కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు రూ. 2 లక్షల కోట్లు అని స్పష్టం చేస్తే, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాత్రం రూ. 8.5 లక్షల కోట్లంటూ తప్పుడు లెక్కలు చెప్తున్నారన్నారు. కేసీఆర్ చేసిన అప్పులతోనే కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, పింఛన్ల పెంప, ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, కళ్యాణలక్ష్మి, కలెక్టరేట్ భవనాలు, సచివాలయం ప్రాజెక్టులు సాధ్యమయ్యాయని గుర్తుచేశారు.
Vemula Prashanth Reddy | 100 పడకలకు ఆస్పత్రి పెంపు
భీమ్గల్లో ఉన్న 10 పడకల ఆస్పత్రిని ప్రశాంత్రెడ్డి చొరవతో 100 పడకల సూపర్ స్పెషాలిటీగా అప్గ్రేడ్ చేసి, రూ. 15 కోట్ల వ్యయంతో 15 నెలల్లో భవనాలు పూర్తి చేయించారని తెలిపారు. మోతే, వేల్పూర్, గోనుగొప్పుల, మెండోరా, బెజ్జోర వద్ద వంతెనలు నిర్మించి దశాబ్దాల రవాణా కష్టాలు తీర్చారన్నారు. బస్ డిపో, మార్కెట్ యార్డ్లకు సంబంధించి మిగిలిన రూ. 3 కోట్ల పనులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేకపోతోందని ప్రశ్నించారు.
ఇందిరమ్మ కమిటీల పేరిట దందాలు
బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అధికారుల లాటరీ విధానంలో అర్హులైన పేదలకే అందించారని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ వేసిన ‘ఇందిరమ్మ ఇళ్ల కమిటీలు’ గ్రామాల్లో లంచాలు దండుకుంటూ నిరుపేదలను బెదిరిస్తున్నాయని ఆరోపించారు. భీమ్గల్కు కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన కోర్టును కూడా తమ ఖాతాలో వేసుకోవాలని చూడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు చౌటుపల్లి రవి, జెడ్పీ మాజీ కోఆప్షన్ మెంబర్ మోయీజ్, మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ భగత్, జాగిర్యాల్ సర్పంచ్ గడాల ప్రసాద్, ఎస్పీ ప్రవీణ్, సిద్ధపల్లి రాములు, పసుల రాజమల్లు, సుర్జిల్, మూత లింబాద్రి, సతీష్ గౌడ్, రాగి నరసింహ చారి, డిష్ గంగాధర్, రాగి రాజు, బోట్ల రామకృష్ణ, రాజు నాయక్, దీక్షిత్, ఇక్రమ్, తాహేర్, జిన్న ప్రవీణ్, తెడ్డు రాజేష్, రెహమాన్, జీసన్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి : ‘సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ’లో వేలాది మందితో ప్రతిజ్ఞ చేయించిన టీఆర్ఎస్ చీఫ్ కవిత