అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Raids | వరంగల్, గనులు, భూగర్భశాస్త్ర శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎఫ్ఏసీ (FAC)గా ప్రస్తుతం పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ బొజ్జ జయరాజు (AD Jayraj) నివాసాల్లో గురువారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఏకకాలంలో 8 ప్రాంతాల్లో సోదాలు చేశారు. ఈ క్రమంలో జయరాజు అక్రమంగా సంపాదించిన పలు ఆస్తులను గుర్తించారు.
అవినీతి, అనుమానాస్పద మార్గాల ద్వారా ఆస్తులు సంపాదించారనే ఆరోపణలపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏడీ జయరాజ్పై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ (ACB) అధికారులు తెలిపారు. ఆయన నివాసంతో పాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లలో తనిఖీలు చేపట్టామన్నారు. ఈ సమయంలో అనేక ఆస్తి పత్రాలు గుర్తించారు. సదరు అధికారికి హైదరాబాద్, బోడుప్పల్లో ఒక G+2 భవనం ఉంది. దీని విలువ సుమారుగా రూ.40 లక్షలు ఉంటుంది. హైదరాబాద్, KPHB కాలనీలో రూ.32 లక్షల విలువైన ఫ్లాట్, కీసరలో రెండు ప్లాట్లు, తుంగతుర్తి, తూప్రాన్, సూర్యాపేటలో ఒక్కో ప్లాట్తో సహా ఐదు ప్లాట్లు ఉన్నాయి. వీటి విలువ రూ. 15,77,469 ఉంటుంది.
ACB Raids | బ్యాంకు ఖాతాల్లో..
జయరాజు పేరిట 3.21 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. తనిఖీల్లో ఏసీబీ అధికారాఉలు రూ.10,03,640 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎల్ఐసీ, మాక్స్ లైఫ్ పొదుపు ఖాతాలలో రూ. 19,86,104, మూడు కార్లు, రెండు బైక్లు ఉన్నట్లు గుర్తించారు. పోస్ట్ ఆఫీస్ ఖాతాలో రూ.20,86,175, 629 గ్రాముల బరువున్న బంగారు ఆభరణాలు, మూడు ఖాతాలలో సుమారుగా రూ.71 లక్షల నిల్వలు ఉన్నట్లు అధికారులు వివరించారు.
ACB Raids | ఇసుక అక్రమ రవాణాకు సహకారం
ప్రాథమిక విచారణ సందర్భంగా నిందితుడైన అధికారి డ్రైవర్ సత్తునూరి యాదయ్య బ్యాంక్ ఖాతా నుంచి ఏడీ జయరాజ్ కుమార్తె బ్యాంక్ ఖాతాకు పలు లావాదేవీల ద్వారా సుమారు రూ.24.80 లక్షలు బదిలీ అయినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇసుక రవాణా, సంబంధిత కార్యకలాపాలలో పాల్గొన్న వ్యక్తుల నుండి సదరు మొత్తాన్ని వసూలు చేసి, నిందితుడైన అధికారి కుమార్తె ఖాతాకు బదిలీ చేసినట్లు డ్రైవర్ అధికారులకు చెప్పారు. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల మొత్తం విలువ సుమారుగా రూ.3.06 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే మార్కెట్ విలువ ప్రకారం వీటి విలువ రూ.వంద కోట్లకు పైనే ఉంంటుంది. విచారణ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
దీనిని కూడా చదవండి : Delimitation Bill | డీలిమిటేషన్పై ఏకపక్ష నిర్ణయాలు వద్దు: మల్లికార్జున ఖర్గే