అక్షరటుడే, ఆర్మూర్: Armoor Political Heat | ఆర్మూర్లో (Armoor) రాష్ట్ర అధికార కాంగ్రెస్(congress), కేంద్ర అధికార బీజేపీ(BJP) పార్టీ నాయకుల మధ్య పోటాపోటీ సవాళ్లతో రాజకీయ వేడి రాజుకుంది. ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి(Mla Rakesh reddy) ఇల్లు ముట్టడిస్తామని కాంగ్రెస్ పిలుపునివ్వగా.. బీజేపీ సైతం తన బలాన్ని చూపించేందుకు సిద్ధమైంది. దీంతో ఆర్మూర్ నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
Armoor Political Heat | సోషల్ మీడియా స్టేటస్లలో పోస్టర్ల హోరు..
‘రూపాయికే వైద్యం, సొంత డబ్బులతో గ్రామానికి 10 ఇళ్లు కట్టిస్తానని ఎన్నికల్లో వాగ్దానం చేసిన ఎమ్మెల్యే రాకేష్రెడ్డి గెలిచిన తర్వాత ఆర్మూర్ ప్రజలను మోసం చేశాడని ఆర్మూర్ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. మాట ఇవ్వడం కాదు.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని.. ఎమ్మెల్యే కళ్లు తెరిపిద్దామని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం ‘చలో అంకాపూర్’కు పిలుపునిచ్చారు. దీంతో వారికి దీటుగా ‘కామారెడ్డిలో జరిగినట్లు సోమవారం ఆర్మూర్లో జరగాలి.. బీజేపీ బలం ఏమిటో చూపిద్దామని పేర్కొంటూ బీజేపీ నాయకులు సిద్ధమయ్యారు. ఈ వ్యాఖ్యలతో ఇరుపార్టీల నాయకులు సోషల్ మీడియాలో స్టేటస్లు, పోస్టర్లతో హల్చల్ చేస్తున్నారు. సోమవారం ‘చలో అంకాపూర్’కు రెండు పార్టీల శ్రేణులు సంసిద్ధమవుతున్నాయి.
Armoor Political Heat | పోటాపోటీగా ప్రెస్మీట్లు..సమావేశాలు..
ఈ నేపథ్యంలో ఆర్మూర్కు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు ఆదివారం టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను కలిసి ఆర్మూర్లో తాజా రాజకీయ పరిస్థితిని వివరించినట్లు సమాచారం. మరోవైపు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి మాట్లాడుతూ.. కాంగ్రెస్ శ్రేణులు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తే, బీజేపీ శ్రేణులంతా టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఇంటితోపాటు ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి ఇళ్లను ముట్టడిస్తామని పిలుపునివ్వడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. రూ.700 కోట్లతో ఆర్మూర్ నియోజకవర్గంలో ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఎమ్మెల్యే అభివృద్ధి చేస్తుంటే కాంగ్రెస్ నేతలు విమర్శలకు దిగడం సిగ్గుచేటని ఆయన పేర్కొన్నారు.
Armoor Political Heat | పోలీస్శాఖ అప్రమత్తం..
పోటాపోటీ ప్రకటనల నేపథ్యంలో పోలీస్శాఖ అప్రమత్తమైంది. ఆర్మూర్లో ఆదివారం నుంచి సోమవారం వరకు బీఎన్ఎస్ 163 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రకటించారు. ధర్నాలు, రాస్తారోకోలకు ఆస్కారం లేదన్నారు. చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్హెచ్వో సత్యనారాయణ హెచ్చరించారు.
Armoor Political heat | యుద్ధానికి నా స్థాయి వారితోనే సిద్ధం: పైడి రాకేష్ రెడ్డి, ఎమ్మెల్యే, ఆర్మూర్
‘ఓడిపోవడానికి పుట్టిన వారు, అపజయం తప్ప విజయం ఎరగనివారు తప్పుడు పోస్టర్లతో ఆర్మూర్లో రాజకీయ క్రీడకు తెరలేపారు’ అని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మండిపడ్డారు. యుద్ధానికి తన స్థాయి వారితోనే సిద్ధమని, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఎవరొచ్చినా తాను సిద్ధమన్నారు. అంకాపూర్ ముట్టడి ఎందుకని ప్రశ్నిస్తూ.. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని అంకాపూర్కు గౌరవంగా స్వాగతిస్తున్నామని, అంకాపూర్ నాటుకోడి చికెన్తో భోజనం చేయిస్తామన్నారు. సోమవారం అంకాపూర్లో తాను సిద్ధంగా ఉంటానని, ఆర్మూర్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే ఎవరినీ విడిచిపెట్టబోమన్నారు. ఆర్మూర్లో ఎవరి ఆటలు సాగనివ్వమని, నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలన్నారు.
హైదరాబాద్లో దుకాణం బంద్ : వినయ్ కుమార్ రెడ్డి, ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి
‘ఎన్నికల సమయంలో ఒక్క రూపాయికే వైద్యం పేరుతో హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలో ఏర్పాటు చేసిన దుకాణం బంద్ అయింది’ అని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి విమర్శించారు. ఒక రూపాయికి వైద్యం, ప్రతి గ్రామంలో సొంత ఖర్చుతో 10 ఇళ్లు పేరుతో ఇచ్చిన ఎన్నికల హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుల షోరూమ్లోని స్కూటీలు ఎత్తుకుపోవాలని, ఫీజు రీయింబర్స్మెంట్ అడగాలని మాట్లాడే తప్పుడు మాటలను మానుకోవాలన్నారు. ఆర్మూర్ అభివృద్ధికి ఎమ్మెల్యే చేసిందేమీ లేదన్నారు. ‘చలో అంకాపూర్’కు కాంగ్రెస్ శ్రేణులు పెద్దఎత్తున తరలివస్తారని.. తాను సైతం హైదరాబాద్ నుంచి ఆర్మూర్కు చేరుకున్నట్లు వినయ్ రెడ్డి చెప్పారు.
ఇది కూడా చదవండి: Fierce US Attacks on Iran