అక్షరటుడే, కామారెడ్డి: Congress Infighting | మాజీ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) కామారెడ్డిలో గ్రూప్ తగాదాలకు ఆజ్యం పోస్తున్నారని టీపీసీసీ(TPCC) జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్గం ఆరోపించింది. ఈ మేరకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ (PCC Disciplinary Committee) ఛైర్మన్ మల్లు రవికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది.
Congress Infighting | కామారెడ్డిలో పార్టీ బలోపేతం కాకుండా..
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మామిండ్ల అంజయ్య, కామారెడ్డి మున్సిపల్ మాజీ ఛైర్మన్ గడ్డం ఇందుప్రియ ఆధ్వర్యంలో గురువారం క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ను గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్గం కలిసింది. షబ్బీర్ అలీ కుటుంబం కామారెడ్డిలో(Kamareddy) కాంగ్రెస్ పార్టీ బలోపేతం కాకుండా అడ్డుకుంటోందని, గ్రూప్ తగాదాలకు ఆజ్యం పోస్తోందని వర్గ సభ్యులు ఆరోపించారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి పోటీ చేసినప్పుడు షబ్బీర్ అలీ వర్గం పనిచేయకపోవడం వల్లే ఓటమి పాలయ్యారని పేర్కొన్నారు. రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి ఇన్ఛార్జీగా ప్రచారం చేసినా షబ్బీర్ అనుచరులు సహకరించలేదని తెలిపారు. 2026 మున్సిపల్ ఎన్నికల్లో 49 వార్డులకు గాను షబ్బీర్ అలీ వర్గానికి 40 టికెట్లు ఇస్తే 16 మంది గెలిచారని, చంద్రశేఖర్ రెడ్డి వర్గానికి 9 సీట్లిస్తే 3 గెలిచారని వివరించారు. మిగిలిన 6 మంది అభ్యర్థులను షబ్బీర్ అలీ సోదరుడు నయీమ్, కుమారుడు ఇలియాస్ ఓడించారని ఆరోపించారు.
Congress Infighting | రూ.4 కోట్లకు డీల్ కుదుర్చుకుని..
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన అభ్యర్థులున్నా రూ.4 కోట్ల డీల్ చేసుకొని ఇండిపెండెంట్గా గెలిచిన ఇప్ప ఉమారాణి శ్రీనివాస్కు మున్సిపల్ ఛైర్పర్సన్ పదవి ఇప్పించారని ఆరోపించారు. షబ్బీర్ అలీ సోదరుడు మహ్మద్ నయీమ్ను సంప్రదించకుండా కామారెడ్డికి ఎస్సై నుంచి డీఎస్పీ, తహశీల్దార్, ఎంపీడీవో స్థాయి అధికారులు బదిలీపై రాలేరని, ప్రతిదానికి మామూళ్లు సమర్పించాల్సి వస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. 1989 నుంచి 9 సార్లు పోటీ చేసిన షబ్బీర్ అలీ కేవలం 2 సార్లు మాత్రమే గెలిచారని, అయినా ద్వితీయ శ్రేణి నేతలకు, యువతకు అవకాశం ఇవ్వకుండా కుటుంబ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. జీసీఆర్ ట్రస్ట్ ద్వారా పేదలకు పుస్తెమట్టెలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు వంట సామాగ్రి, జాబ్ మేళా ద్వారా 500 మందికి ఉద్యోగాలు కల్పిస్తే షబ్బీర్ వర్గం బెదిరింపులకు పాల్పడుతోందని తెలిపారు.
Congress Infighting | ఫిర్యాదు స్వీకరించిన మల్లురవి..
ఫిర్యాదు స్వీకరించిన క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి సానుకూలంగా స్పందించి కామారెడ్డి ఘటనపై విచారణ జరుపుతానని హామీ ఇచ్చారని నాయకులు పేర్కొన్నారు. అధిష్టానం కామారెడ్డిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ జోక్యం చేసుకోవాలని నేతలు కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు నిమ్మ విజయకుమార్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు గడ్డమీది మహేష్, తాటి లావణ్య, మాజీ కౌన్సిలర్లు సలీం, రంగ రమేష్ గౌడ్ సహా పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


ఇది కూడా చదవండి: FRO Caught by ACB | లంచం తీసుకుంటూ దొరికిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
