Harish Rao Comments | కొండా సురేఖపై యాక్షన్.. మరి పొంగులేటిపై ఎందుకు లేదు?: రేవంత్‌‌కు హరీశ్ రావు ప్రశ్న

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సిర్పూర్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్ రావు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Harish Rao Comments | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సిర్పూర్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్ రావు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 22-ఏ (22-A) నిషేధిత భూముల విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఆయన్ను ‘పొంగులేటి’ కాదని ‘బొంకులేటి’ అంటూ ఎద్దేవా చేశారు.

Harish Rao Comments | అసెంబ్లీకి రాకుండా ..

పార్టీలో తనను విమర్శించారనే కారణంతో మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. నిషేధిత భూముల పేరిట ప్రజలను ఇబ్బంది పెడుతున్న పొంగులేటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హరీశ్ రావు నిలదీశారు. రేవంత్ రెడ్డితో పొంగులేటికి ఎలాంటి పొత్తుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పేదల భూములను నిషేధిత జాబితాలో పెట్టిన పొంగులేటిని అసెంబ్లీకి రాకుండా నిషేధించాలని కోరారు. సూర్యుడి చుట్టూ భూమి తిరిగితే, కాంగ్రెస్ పాలనలో భూముల చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతున్నారని సెటైర్లు వేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు కూడా 22-ఏ జాబితాలోనే ఉందని, అయితే ఆ ఇల్లు నిషేధిత జాబితాలో పడిన వెంటనే రాత్రికి రాత్రే దానిని తొలగించుకున్నారని ఆరోపించారు. మరి పేదలకు ఒక న్యాయం, ముఖ్యమంత్రికి మరో న్యాయమా అంటూ ప్రశ్నించారు.

Harish Rao Comments | అసెంబ్లీ ముట్టడిస్తాం..

22-ఏ అనేది ఎక్కడో ఒక్కచోట జరిగిన పొరపాటు కాదని, కేవలం కాగజ్‌నగర్ నియోజకవర్గంలోనే ఏకంగా 42,867 ఎకరాల రైతుల భూములు నిషేధిత జాబితాలో బందీ అయ్యాయని హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. నిషేధంలో పెట్టిన పేదల భూములను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, లేదంటే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. భూములు లేవంటూ బ్యాంకు మేనేజర్లు రైతులను బయට గెంటుతున్నారని, పెళ్లిళ్లు ఆగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఇందిరమ్మ రాజ్యమా లేక కబ్జాల రాజ్యమా అని మండిపడ్డారు. రైతులను కబ్జాదారులుగా అవమానించిన సీఎం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, దళితబంధు అన్నీ బంద్ అయ్యాయని హరీశ్ రావు విమర్శించారు. ప్రతి అవ్వకు, తాతకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.66 వేలు బాకీ పడిందని, ఆ డబ్బులను వడ్డీతో సహా వసూలు చేస్తామని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి:  Konda Surekha Dismissal | ఆ కారణం వల్లే కొండా సురేఖ బర్త్‌రఫ్: టీపీసీసీ చీఫ్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *