అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Congress Dispute | కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ (Congress Party)లో కొంతకాలంగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలపై పార్టీ క్రమశిక్షణ కమిటీ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మధ్య నెలకొన్న పరస్పర విభేదాలు, ఫిర్యాదులపై కమిటీ ఆదివారం మరోసారి విచారణ చేపట్టింది.
Kamareddy Congress Dispute | కమిటీ ఎదుట షబ్బీర్, చంద్రశేఖర్ రెడ్డి హాజరు..
ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై తమ వాదన వినిపించిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, ఆయన సతీమణి, మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ గడ్డం ఇందుప్రియతో పాటు, కమిటీ సూచన మేరకు ఆదివారం షబ్బీర్ అలీ (Shabbir Ali) కూడా హాజరయ్యారు. వివాదానికి కారణమైన ఆడియో కాల్ వ్యవహారంపై షబ్బీర్ అలీ ఇదివరకే కమిటీకి సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఆదివారం కమిటీ ఛైర్మన్ మల్లు రవి ఇరువర్గాలతో విడివిడిగా సమావేశమై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం షబ్బీర్ అలీ, చంద్రశేఖర్ రెడ్డి దంపతులతో కలిసి చర్చించి వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించారు. సీనియర్ నేతల మధ్య విభేదాలు పార్టీకి నష్టం చేస్తాయని, వ్యక్తిగత విబేధాలను పక్కనపెట్టి పార్టీ బలోపేతం కోసం సమష్టిగా పనిచేయాలని మల్లు రవి ఇద్దరు నేతలకు గట్టిగా సూచించారు.
Kamareddy Congress Dispute | మరోసారి విచారణ
పోలీసు కేసులు, ఫిర్యాదులతో నేతల మధ్య దూరం పెరుగుతుందనే క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ సూచనలతో ఇరువురు నేతలు ఏకీభవించారు. వెంటనే ఒకరికొకరు స్వీట్లు పంచుకుని ఇకపై కలిసికట్టుగా పనిచేస్తామని కమిటీకి హామీ ఇచ్చారు. దీంతో కామారెడ్డి కాంగ్రెస్లో నెలకొన్న విభేదాలకు క్రమశిక్షణ కమిటీ తెరదించింది. అయితే ఆడియో కాల్లో పీసీసీ చీఫ్పై షబ్బీర్ అలీ మాట్లాడిన అంశంపై మాత్రం మరోసారి విచారణ చేపట్టనున్నట్టు సమాచారం. కాగా.. గత 15 రోజులుగా కామారెడ్డి నేతల మధ్య విబేధాలు రచ్చకెక్కాయి. ఇరువర్గాల పోటాపోటీ ఫిర్యాదులతో కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఇరువర్గాల నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలో ఛైర్మన్ సూచన మేరకు ఇద్దరు నేతలు ఏ మేరకు కలిసి పని చేస్తారనే అనుమానాలు సొంత పార్టీ క్యాడర్ లో వ్యక్తం అవుతున్నాయి.
ఇది కూడా చదవండి..: Overloaded Vehicles Seized | రవాణాశాఖ కొరడా.. ఓవర్ లోడ్ వాహనాల సీజ్