అక్షరటుడే, వెబ్డెస్క్: KTR Counter to Pawan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే అని పేర్కొన్నారు. సోమాజీగూడ ప్రెస్క్లబ్లో బుధవారం ఆయన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు.
ఈ దేశంలో ఏ నాయకుడైనా పార్టీ పెట్టవచ్చని కేటీఆర్ (KTR) అన్నారు. ఎక్కడైనా పోటీ చేయవచ్చని, ఏ ప్రాంతంలో పోటీ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంత పరిస్థితులు, పోరాటాలు తెలుసుకోవాలన్నారు. జనసేన కొత్తగా పోటీ చేసేదేముంది?.. 2023లో చేయలేదా అని ప్రశ్నించారు. తెలంగాణ ఆవిర్భావం రోజే మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముందన్నారు.
KTR Counter to Pawan | తెలంగాణ ఓజీ కేసీఆర్

తెలంగాణ ఓజీ కేసీఆర్ అని కేటీఆర్ అన్నారు. దేశ భక్తి, పోరాటాల గురించి మేము పవన్ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని పేర్కొన్నారు. నటుడిగా అభిమానిస్తామని, సోదరుడిగా ఇంటికి వస్తే బిర్యానీ పెడతామన్నారు. కానీ మా రాజకీయాల్లో పెత్తనం చేస్తామంటే ఊరుకోమని హెచ్చరించారు. మొన్ననే అంత కష్టపడి విడిపోయాం కదా మళ్లీ మీ పెత్తనం ఎందుకని ప్రశ్నించారు.
KTR Counter to Pawan | అది ప్రాంతీయవాదం కాదా..
ప్రాంతీయ వాదం ఉగ్రవాదం కంటే ప్రమాదమని పవన్ కళ్యాణ్ అంటున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పొట్టి శ్రీరాములు మద్రాస్ నుంచి ఆంధ్ర వేరుపడాలని 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ఆత్మబలిదానం చేసుకున్నారు కదా.. అది కూడా ప్రాంతీయ వాదం అంటారా అని ప్రశ్నించారు. ప్రాంతీయ వాదం అంటే తెలంగాణకి రావాల్సిన పెట్టుబడులు గుజరాత్లో పెట్టుకున్నారు.. మరి జాతీయ వాదం ముసుగులో చేస్తున్న ఆర్ధిక ప్రాంతీయ వాదం కరెక్టేనా అని నిలదీశారు.
KTR Counter to Pawan | కాంగ్రెస్ ఫస్ట్ హాఫ్ డిజాస్టర్..

కాంగ్రెస్ ఫస్ట్ హాఫ్ పాలన డిజాస్టర్ అని కేటీఆర్ విమర్శించారు. ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామన్నారని, ఇప్పటికీ అతి గతి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 నెలల్లో పిల్లలు పుడతారా అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, 30 నెలలైనా హామీలు నెరవేరకపోతే మిమ్మల్ని ఏమనాలని ఎద్దేవా చేశారు. ఆర్థిక పరిస్థితి బాగాలేదు అంటూనే పత్రికల్లో ప్రకటనలు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు.
KTR Counter to Pawan | రేవంత్ రెడ్డి డైవర్షన్ గేమ్
తుమ్మిడిహట్టి అనేది రేవంత్ రెడ్డి డైవర్షన్ గేమ్ అని కేటీఆర్ ఆరోపించారు. ఇపుడు అతను కూర్చుంటున్న ఆఫీసులోనే గతంలో మహారాష్ట్ర ప్రభుత్వాలు తుమ్మిడిహట్టి ప్రాజెక్టు 152 మీటర్ల ఎత్తుకు పెంచడానికి ఒప్పుకోం అని రాసిన లేఖలు ఉన్నాయన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు ఒప్పించలేకపోయారని, అంత పట్టుదల ఉంటే పోయి మహారాష్ట్ర సీఎం ఇంటి ముందు నిరహార దీక్ష చేయాలని సూచించారు.
ఇది కూడా చదవండి..: ACB Raids Hyderabad | ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావు ఇళ్లలో ఏసీబీ సోదాలు
