అక్షరటుడే, వెబ్డెస్క్ : Miryalaguda Cylinder Blast | సిలిండర్ పేలి ముగ్గురు సజీవ దహనం అయ్యారు. ఈ విషాద ఘటన నల్గొండ జిల్లా (Nalgonda District) మిర్యాలగూడలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
పట్టణంలోని కలాల్వాడలో రేకుల ఇంట్లో వనం చంద్రకళ(45) నివాసం ఉంటోంది. ఆమె భర్త నెల క్రితమే అనారోగ్యంతో మృతి చెందాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉండగా.. పెద్దకుమార్తె ధనమ్మ భర్త సైతం పదేళ్ల క్రితం చనిపోయాడు. దీంతో ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి వద్దే ఉంటూ కూలీ పనులు చేసుకొని జీవిస్తోంది. ఆమె మూడు రోజుల క్రితం ఇళ్లలో పని చేయడానికి పూణే వెళ్లింది. పిల్లలను తల్లి వద్దనే ఉంచింది. గురువారం రాత్రి చంద్రకళ తన మనవడు, మనవరాలితో కలిసి ఇంట్లో పడుకుంది.

Miryalaguda Cylinder Blast | మంటలు అంటుకొని..
అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ (Short circuit)తో ఇంట్లో మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి మంటలు ఆర్పేందుకు యత్నించారు. అయితే అదే సమయంలో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో ముగ్గురు మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అనంతరం మృతదేహాలను బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.

ఇది కూడా చదవండి..: Travel Bus Fire | ట్రావెల్స్ బస్సు దగ్ధం.. తప్పిన ప్రమాదం
