అక్షరటుడే, ఇందూరు: MLA Dhanpal | కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యవహారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనని స్పష్టమైందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (Mla Dhanpal) తెలిపారు. నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పీసీ గోష్ కమిషన్ (PC Ghosh Commission) పేరుతో రెండేళ్లపాటు కాలయాపన చేసిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR), హరీష్ రావు, కేటీఆర్ను (KTR) అరెస్ట్ చేస్తామని ప్రకటించిందన్నారు. కానీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
MLA Dhanpal | రూ. లక్ష కోట్ల అవినీతి అని ఆరోపించి..
ప్రాజెక్ట్ వ్యవహారంలో రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడిందని స్వయంగా కాంగ్రెస్ ఆరోపించిందని.. ఇప్పుడేమో కోర్టులో రూ.9వేల కోట్ల అవినీతి జరిగిందంటూ పిటిషన్ వేయడం వెనక ఆంతర్యం ఏమిటో ధన్పాల్ తెలపాలన్నారు. అవినీతిపరులను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోందన్నారు. అవినీతి జరిగినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ వాటిని చట్టపరంగా కోర్టు ముందు సమర్థవంతంగా ఉంచడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే వెంటనే సీబీఐ దర్యాప్తు కోసం కేంద్రానికి లేఖ రాయాలన్నారు. అలాగే హైకోర్టు స్టేను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో (Supreme Court) అప్పీల్ చేయడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని వ్యాఖ్యానించారు.
MLA Dhanpal | అధ్వానంగా రాష్ట్ర పాలన..
రాష్ట్ర ప్రభుత్వ పాలన అధ్వానంగా మారిందని ఎమ్మెల్యే అన్నారు. అర్బన్లో పరిస్థితి కూడా దారుణంగా ఉందన్నారు. సీడీపీ ఫండ్ లేక పనులు ముందుకు సాగడం లేదన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (PCC President Mahesh) ఇందూరుకు వచ్చిన ప్రతిసారి అభివృద్ధి అంటారని.. కానీ నియోజకవర్గ ప్రజలకు ఏమీ చేయడం లేదని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దోచుకోవడమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్నాయని విమర్శించారు. అలాగే మహిళా బిల్లును కాంగ్రెస్ అడ్డుకోవడం దారుణమన్నారు. సమావేశంలో ఫ్లోర్ లీడర్ ప్రమోద్, కార్పొరేటర్లు మల్లేష్ యాదవ్, మల్కాయి మహేందర్, సీనియర్ నాయకులు న్యాలం రాజు, ఇప్పకాయల కిషోర్, సత్యపాల్, పుట్ట వీరేందర్, మండలాధ్యక్షుడు పడాల భూపతి, పిల్లి శ్రీకాంత్, అమంద్ విజయ్, మారావార్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Kaleshwaram Project | కాళేశ్వరంపై సుప్రీంకోర్టుకు.. కేబినెట్ కీలక నిర్ణయం

