అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: PM Rahveer Scheme | రోడ్డు ప్రమాదాల జరిగినప్పుడు భయపడకుండా బాధితులకు సత్వర వైద్యసాయం అందేవిధంగా కృషిచేసి నిండు ప్రాణాన్ని కాపాడాలని సీపీ సాయిచైతన్య(CP Sai Chaitanya) పేర్కొన్నారు. తద్వారా పీఎం రహవీర్గా గుర్తింపు పొందాలని సూచించారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు.
PM Rahveer Scheme | గోల్డెన్ అవర్లో..
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించి ప్రాణాలను కాపాడడంతో పాటు, ప్రమాద బాధితులకు సహాయం చేసే పౌరులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పీఎం రహత్ (PM RAHAT), పీఎం రహవీర్ (PM RAHVEER) పథకాలను అమలు చేస్తోందని సీపీ తెలిపారు. ఈ రెండు పథకాల ప్రధాన ఉద్దేశ్యం గోల్డెన్ అవర్లో రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ సహాయం అందించడమేన్నారు.
PM Rahveer Scheme | పీఎం రహత్ పథకం..
రోడ్డు ప్రమాదంలో గాయపడిన అర్హులైన బాధితులకు రూ.1.5 లక్షల వరకు ఉచిత క్యాష్లెస్ వైద్యం లేదా ప్రమాదం జరిగిన తేదీ నుండి గరిష్టంగా ఏడు రోజుల వరకు ఉచిత చికిత్స అందించబడుతుందని సీపీ తెలిపారు. ప్రభుత్వ గుర్తించిన ఎంపానెల్డ్ ఆస్పత్రుల్లో చికిత్స జరుగుతుందన్నారు. అలాగే జిల్లా పైలట్ ఆస్పత్రులుగా మనోరమ హాస్పటల్, ప్రగతి హాస్పటల్ ఉన్నాయన్నారు.
PM Rahveer Scheme | పీఎం రహవీర్ పథకం..
రోడ్డు ప్రమాదాల్లో తీవ్ర గాయాలు (Grievous Injury) అయిన బాధితులకు గోల్డెన్ అవర్లో సహాయం చేసి, సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందేలా చేసిన వ్యక్తిని “రహ్-వీర్”గా గుర్తించి కేంద్ర ప్రభుత్వం రూ.25,000 నగదు ప్రోత్సాహకం అందజేస్తుందని సీపీ సాయిచైతన్య తెలిపారు. రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వివరాలను ఈడీఏఆర్ eDAR (Electronic Detailed Accident Report) ద్వారా నమోదు చేసి, పోలీస్ శాఖ, రవాణా శాఖ, ఆరోగ్య శాఖ, ఆస్పత్రులు, బీమా సంస్థలు, ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో అవసరమైన చర్యలను వేగవంతంగా చేపడ్తాయని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాద బాధితుడిని చూసిన వెంటనే భయపడకుండా సహాయం చేయాలన్నారు. సమయానికి అందించిన సహాయం ఒక ప్రాణాన్ని కాపాడగలదని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: CC Footage | షాపింగ్ కాంప్లెక్స్ నుంచి పడిన చిన్నారి..