అక్షరటుడే, కామారెడ్డి: Sadashivanagar Police | సదాశివనగర్ పోలీసుల అప్రమత్తత, సమయస్ఫూర్తితో గురువారం సాయంత్రం భారీ రోడ్డు ప్రమాదం తప్పింది. కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు మర్కల్ ఎక్స్ రోడ్ సమీపానికి చేరుకోగానే సాయంత్రం 5:23 గంటల సమయంలో వెనుక టైర్ అకస్మాత్తుగా బ్లాస్ట్ అయింది. దీంతో బస్సు అదుపు తప్పే పరిస్థితి నెలకొంది.

Sadashivanagar Police | రహదారిపై ట్రాఫిక్ను నిలిపివేయడంతో..
ఆ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రంజిత్, హోంగార్డు వేణు వెంటనే స్పందించి రహదారిపై ట్రాఫిక్ను నిలిపివేశారు. అదే సమయంలో బస్సు వెనుక వేగంగా వస్తున్న కారును సకాలంలో ఆపడంతో ప్రమాదం నివారించగలిగారు.
ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికులతో పాటు కారులో ఉన్నవారంతా సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదాన్ని సమయానికి అడ్డుకున్న సదాశివనగర్ పోలీసుల సేవలను స్థానికులు అభినందించారు.
ప్రజల ప్రాణ రక్షణే లక్ష్యంగా కామారెడ్డి జిల్లా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది. ప్రయాణానికి ముందు వాహనాల టైర్లు, బ్రేకులు తదితర సాంకేతిక అంశాలను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని పోలీసులు వాహనదారులకు సూచించారు.