అక్షరటుడే, వెబ్డెస్క్: TGSRTC Strike | ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు (Ramchandra Rao) అన్నారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన భగీరథ జయంతిలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఆర్టీసీ సమ్మె (RTC Strike) బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల సామూహిక వైఫల్యాన్ని ప్రతిబింబించే విషయమన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఈ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని, ప్రస్తుత కాంగ్రెస్ సైతం అదే మొండి వైఖరి, నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తోందని మండిపడ్డారు ఆర్టీసీ ఉద్యోగులకు బీజేపీ (BJP) అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చినా ప్రభుత్వం చర్యలు చేపట్టలేదన్నారు. దీంతో నేడు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
TGSRTC Strike | పాత డిమాండ్లే
ఆర్టీసీ కార్మికులు (RTC Workers) కోరుతున్న డిమాండ్లు కొత్తవి కావని రాంచందర్రావు అన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో సైతం వీటి కోసమే పోరాడారని గుర్తు చేశారు. ఆ రోజు ఈ డిమాండ్లకు కాంగ్రెస్ మద్దతు తెలిపిందని గుర్తు చేశారు. అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఈ డిమాండ్లకు బహిరంగంగా మద్దతు తెలిపారన్నారు. మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా వారి గురించి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆర్టీసీ కార్మికులు ఎక్కడ సమ్మె చేస్తున్నారో అక్కడికి వెళ్లి సంఘీభావం తెలియజేయాలని సూచించారు.
ఇది కూడా చదవండి..: RTC Strike | రేవంత్ సర్కార్కు బీఆర్ఎస్ హెచ్చరిక.. మరో ‘సకల జనుల సమ్మె’ తప్పదా?

