అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Kaleshwaram Verdict | కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పు హర్షణీయమని మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గణేష్ గుప్తా (Bigala Ganesh Gupta) అన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
Kaleshwaram Verdict | న్యాయం గెలిచింది
కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించడంతో న్యాయం గెలిచిందని ఆయన పేర్కొన్నారు. కమిషన్ విచారణలో ప్రాథమిక నిబంధనలు పాటించలేదని కోర్టు స్పష్టం చేయడం ద్వారా ఆ నివేదికకు చట్టపరమైన ప్రాముఖ్యత లేదని తేలిందన్నారు. ముఖ్యంగా సెక్షన్–8 కింద సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇవ్వకుండా ఆరోపణలు చేయడం సరికాదని కోర్టు వ్యాఖ్యానించడం అత్యంత కీలకమన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR), మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao)పై రాజకీయంగా ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కమిషన్లను అడ్డంపెట్టుకుని వేధింపులకు పాల్పడిందని విమర్శించారు.
Kaleshwaram Verdict | న్యాయస్థానాలపై నమ్మకంతో..
న్యాయస్థానాలపై బీఆర్ఎస్కు నమ్మకముందని.. ఆ నమ్మకమే నిజమైందని బిగాల అన్నారు. తెలంగాణ జీవధారగా భావించే కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ పార్టీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కక్షపూరితంగా వ్యవహరించాయని విమర్శించారు. ప్రాజెక్టు మరమ్మతులను సకాలంలో చేపట్టకుండా దాదాపు రెండున్నరేళ్లు ఆలస్యం చేశారని, చివరకు గత్యంతరం లేక ఇప్పుడు పనులు చేపడుతున్నారన్నారు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్పై చేసిన ఆరోపణలు నిరాధారమని ఈ తీర్పుతో స్పష్టమైందని, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఈ తీర్పుతోనైనా కనువిప్పు కలగాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) రాజకీయ వేధింపులను పక్కన పెట్టి పాలనపై దృష్టి సారించి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని గణేష్ బిగాల సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, మాజీ మేయర్ దండు నీతుకిరణ్ శేఖర్, పార్టీ నగర అధ్యక్షుడు సిర్ప రాజు, నుడా (NUDA) మాజీ ఛైర్మెన్ ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్, నవీద్ ఇక్బాల్, గాండ్ల లింగం, మతిన్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: RTC Recruitment | ఆర్టీసీలో తాత్కాలిక పద్ధతిలో కండక్లర్లు, డ్రైవర్ల నియామకం

