అక్షరటుడే, కామారెడ్డి: Woman Murder Case | కూలీల అడ్డా వద్ద మహిళ తనతో కాకుండా మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉండటం ఓర్వలేని ఓ వ్యక్తి ఆమెను హత్య చేశాడు. నిందితుడిని కామారెడ్డి (Kamareddy) పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు.
Woman Murder Case | పాల్వంచ మండలం పోతారం..
డీఎస్పీ మధుసూదన్ శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. పాల్వంచ (Palvancha) మండలం పోతారం గ్రామానికి చెందిన నర్సాపురం శ్యామల మే 31న భర్త నర్సాపురం రాజంతో కలిసి కూలి పనికి కామారెడ్డికి వచ్చింది. భర్తకు పని దొరకగా శ్యామలకు పని దొరకలేదు. కూరగాయలు కొని ఇంటికి వస్తానని చెప్పి వెళ్లిన ఆమె సాయంత్రం వరకు ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావడంతో అనుమానించిన భర్త కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందిన వెంటనే జిల్లా ఎస్పీ ఆదేశాలతో, డీఎస్పీ మధుసూదన్ పర్యవేక్షణలో టౌన్ సీఐ నరహరి నేతృత్వంలో రెండు ప్రత్యేక బృందాలు ఏర్పడి గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో జూన్ 3న గ్రీన్ సిటీ సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన గుర్తు తెలియని మహిళ మృతదేహం లభించింది. ఫిర్యాదుదారుడు, కుటుంబ సభ్యులు వెళ్లి మృతదేహాన్ని శ్యామలదిగా గుర్తించారు. మృతదేహంపై తలకు తీవ్ర గాయాలు ఉండడంతో కేసును హత్యగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Woman Murder Case | ప్రత్యేక బృందాలు.. సీసీ పుటేజీలు
ప్రత్యేక బృందాలు సీసీటీవీ పుటేజీలు సేకరించి పరిశీలించగా మృతురాలితో కలిసి తిరిగిన ఓ వ్యక్తి కదలికలు గుర్తించారు. సాంకేతిక ఆధారాలు, సాక్షుల సమాచారంతో శుక్రవారం కామారెడ్డి లేబర్ అడ్డా వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నిజామాబాద్(Nizamabad) జిల్లా నవీపేట్ మండలం శిరాన్పల్లి గ్రామానికి చెందిన పిట్ట నర్సింలు అలియాస్ నర్సులును అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. శ్యామలతో తనకు కొంతకాలంగా పరిచయం ఉందని, ఇద్దరూ కలిసి కూలీ పనులకు వెళ్లేవారని, ఆమెకు తరచూ డబ్బులు ఇచ్చేవాడినని తెలిపాడు. అయితే ఆమె మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉండడం చూసి అసూయ పెంచుకున్నానని చెప్పాడు.
జూన్ 3న గ్రీన్ సిటీ సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి మద్యం తాగిన అనంతరం ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో రాయితో తలపై కొట్టి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అనంతరం ఆమె మొబైల్ ఫోన్ తీసుకొని రైల్వే స్టేషన్ వద్ద రక్తపు మరకలు ఉన్న బట్టలు మార్చి, ఫోన్ను రూ.200లకు విక్రయించినట్లు వెల్లడించాడు. నిందితుడు గతంలోనూ నిజామాబాద్ నాలుగో టౌన్లో దోపిడీ కేసు, బాసరలో హత్య కేసులో అరెస్టై జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఆ కేసుల్లోనూ మామిడి రాజన్న పేరుతో తిరిగినట్లు తేలిందని డీఎస్పీ వివరించారు. ఈ సమావేశంలో టౌన్ సీఐ నరహరి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: ఢిల్లీలో జరిగిన #Ramayana కార్యక్రమంలో సూపర్ స్టార్ రణబీర్ కపూర్