అక్షరటుడే, వెబ్డెస్క్: Mahalakshmi Card | రోజూ లక్షలాది మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం ఆధార్కార్డు చూపిస్తే ఉచిత ప్రయాణానికి అనుమతిస్తున్నారు. అయితే ఈ విధానంలో మార్పులు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం (State Government) యోచిస్తోంది. మహాలక్ష్మి పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు ఆధార్ కార్డుల స్థానంలో స్మార్ట్కార్డులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2 నుంచి మహిళలకు ‘మహాలక్ష్మి’ స్మార్ట్కార్డులు జారీ చేయడానికి కసరత్తు చేస్తున్నారు. ముందుగా జిల్లాకు ఒక మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, కార్డులు అందిస్తారు. ఆ తర్వాత అంతటా పంపిణీ చేస్తారు.
Mahalakshmi Card | ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
మహిళలు తమ సమీపంలోని మీసేవ కేంద్రాలు లేదా టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) బస్ పాస్ కౌంటర్లలో ఈ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. దరఖాస్తు సమయంలో రూ.50 నామమాత్రపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫొటో, మొబైల్ నంబర్ సమర్పిస్తే నమోదు ప్రక్రియ పూర్తవుతుంది. కార్డుల జారీ, దరఖాస్తు చేసుకునే విధానం, ఇతర నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.
Mahalakshmi Card | ఏటీఎం తరహాలో..
మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు పంపిణీ చేసే స్మార్ట్కార్డు ఏటీఎం తరహాలో అదే సైజులో ఉంటుంది. ఆధార్ కార్డు, ఒక ఫొటో సేకరించి మహిళల ప్రాథమిక సమాచారాన్ని చిప్తో అనుసంధానిస్తారని తెలుస్తోంది. తర్వాత వారి పేర్లతో కార్డు జారీచేస్తారు. పూర్తిగా అమలులోకి వచ్చాక మహాలక్ష్మి స్మార్ట్కార్డ్ చూపిస్తేనే బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారు. కండక్టర్లు ఈ స్మార్ట్కార్డ్ను సులభంగా స్కాన్ చేసి జీరో టికెట్ ఇవ్వడానికి వీలుంటుందని భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Hyderabad Land Price | గ్రేటర్ హైదరాబాద్లో భూమికి రికార్డు ధర.. ఎకరం ₹237 కోట్లు


