అక్షరటుడే, బోధన్: Bodhan Municipality | బోధన్ (Bodhan) బల్దియా తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. పాలకవర్గం ఏర్పడి నెలలు గడిచినప్పటికీ సర్వసభ సమావేశం నిర్వహించకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Bodhan Municipality | ప్రతినెలా నిర్వహించాల్సి ఉండగా..
సాధారణంగా ప్రతి మున్సిపాలిటీలో మున్సిపల్ ఛైర్పర్సన్, కౌన్సిలర్లతో కలిసి ప్రతినెలా సర్వసభ్య సమావేశం (Municipal Council Meeting) నిర్వహించాల్సి ఉంటుంది. వార్డుల్లోని సమస్యలను కౌన్సిలర్ల ద్వారా తెలుసుకుని, ప్రజలకు కావాల్సిన సౌకర్యాలను కల్పించేందుకు ఈ సమావేశాలు దోహదపడతాయి. కానీ బోధన్ మున్సిపాలిటీలో ఇందుకు పూర్తి విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత మార్చి 31న బడ్జెట్ సమావేశం నిర్వహించిన అనంతరం రెండు నెలలు గడుస్తున్నా మళ్లీ ఎలాంటి సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయలేదు. దీంతో తమ వార్డుల్లో సమస్యలు పేరుకుపోతున్నాయని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు.

Bodhan Municipality | బక్రీద్ పండుగపై ప్రణాళికలు శూన్యం..
ముస్లింలకు ఎంతో పవిత్రమైన బక్రీద్(Bakrid) పండుగ మే నెలలోనే ముగిసింది. ఇలాంటి పెద్ద పండుగల సమయంలో పట్టణంలో పారిశుధ్య సమస్యలు (Sanitation Problems) తలెత్తకుండా సర్వసభ్య సమావేశంలో చర్చించి ముందస్తు ప్రణాళికలు రూపొందించు కోవాల్సి ఉండేది. కానీ, బోధన్ మున్సిపాలిటీలో ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లేకుండానే పండుగను మమ అనిపించేశారని స్థానికులు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఆయా వార్డుల్లో డ్రైనేజీలు శుభ్రం చేయకపోవడం, చెత్త సక్రమంగా సేకరించకపోవడం వంటి పారిశుధ్య సమస్యలు తీవ్రమవుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు.
Bodhan Municipality | షాడో ఛైర్మన్ పెత్తనమే కారణమా?
బోధన్లో ‘షాడో ఛైర్మన్’ వర్సెస్ కౌన్సిలర్ల మధ్య అగాధం ఏర్పడినట్లు స్పష్టంగా అర్థమవుతోందని ప్రజలు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, ఇప్పటికైనా మున్సిపల్ పాలకవర్గం తన బాధ్యతను విస్మరించకుండా, తక్షణమే సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై బోధన్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణను వివరణ కోరగా.. సర్వసభ్య సమావేశం నిర్వహణ అంశాన్ని మున్సిపల్ ఛైర్పర్సన్ తూము పద్మ దృష్టికి తీసుకెళ్లామని, ఆమె అనుమతి ఇవ్వగానే సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఇది కూడా చదవండి: Ponguleti Key Comments | ఏ శాఖ ఇచ్చిన పని చేస్తా.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
