అక్షరటుడే, లింగంపేట: Lingampet Floods | కామారెడ్డి Kamareddy జిల్లాలో సోమవారం రాత్రి కురిసిన ఎడతెరిపి లేని భారీ వర్షాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి. రాత్రంతా కురిసిన వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుని, రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వంతెనలపై వరద నీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో స్థానికులు ఇళ్లకే పరిమితమయ్యారు.
Lingampet Floods | ప్రమాదకర స్థాయిలో పెద్ద వాగు ప్రవాహం
లింగంపేట మండలంలోని పెద్దవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వంతెనకు ఆనుకుని భారీగా వరద నీరు పారుతుండటంతో ప్రమాద పరిస్థితులు నెలకొన్నాయి. అప్రమత్తమైన పోలీసులు వంతెన వద్ద భద్రతా చర్యలు చేపట్టి, ఎవరూ వంతెన దాటకుండా హెచ్చరికలు జారీ చేశారు.
ఇక నాగారం వంతెనపై కూడా పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో నాగారం, బాణాపూర్, కొర్పోల్, బాయంపల్లి గ్రామాల ప్రజలకు లింగంపేటతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అత్యవసర పనుల కోసం బయటకు వెళ్లాల్సిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Lingampet Floods | పాములవాగు మళ్లీ ఉగ్రరూపం..
గతేడాది భారీ వర్షాలకు దెబ్బతిన్న పాములవాగు వంతెన స్థానంలో అధికారులు తాత్కాలిక వంతెనను ఏర్పాటు చేశారు. అయితే సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు పాములవాగు మరోసారి ఉగ్రరూపం దాల్చింది. వరద నీరు తాత్కాలిక వంతెనపై నుంచి ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో లింగంపేట–కామారెడ్డి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
Lingampet Floods | ప్రజలకు హెచ్చరికలు జారీ..
పరిస్థితిని పరిశీలించిన స్థానిక పోలీసులు వెంటనే అప్రమత్తమై వంతెన వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ మార్గంలో ప్రయాణించవద్దని, ప్రత్యామ్నాయ రహదారులను ఉపయోగించాలని లింగంపేట ఎస్సై దీపక్ కుమార్ ప్రజలకు సూచించారు.
భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద నీరు ప్రవహిస్తున్న వాగులు, వంతెనలు దాటేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.