అక్షరటుడే, కామారెడ్డి: Gampa Govardhan Criticism | వెయ్యి రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పూర్తిగా విఫలమయ్యారని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విమర్శించారు. బీఆర్ఎస్ చేపట్టిన 8 రోజుల నిరసన కార్యక్రమంలో భాగంగా మంగళవారం తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
Gampa Govardhan Criticism | అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం..
నియోజకవర్గంలో వెయ్యి రోజుల పాలనపై చేపట్టిన నిరసనలు విజయవంతమయ్యాయని గంప గోవర్ధన్ తెలిపారు. చివరి రోజు ఈ చెవిటి, గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరవాలని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించామన్నారు. 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన హామీలను వెయ్యి రోజులైనా అమలు చేయలేదని మండిపడ్డారు. 420 హామీలలో తూతూమంత్రంగా ఒకటి రెండు మాత్రమే అమలు చేశారని, ఆరు గ్యారెంటీల అమలుకు జాతీయ నాయకులతో డిక్లరేషన్లు ఇప్పించారని విమర్శించారు. కామారెడ్డిలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో బీసీ డిక్లరేషన్ చేయించి, ఏడాదికి రూ.20 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు బీసీలకు కేటాయిస్తామని చెప్పి మోసం చేశారన్నారు.
Gampa Govardhan Criticism | కేసీఆర్ హయాంలో ఎన్నో పథకాలు..
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసిన రోజే బృహత్తర పథకాలకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. మూడేళ్లలో వేల కోట్లు ఖర్చు చేసి రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించారని, ప్రపంచ చరిత్రలో ఏ ప్రభుత్వం ఇవ్వలేని విధంగా చనిపోయిన రైతు కుటుంబానికి పది రోజుల్లో బీమా డబ్బులను ఖాతాలో వేయించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు 7 నుంచి 8 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నీరు అందక పంటలు ఎండిపోతున్నాయన్నారు.
Gampa Govardhan Criticism | 33 నెలలుగా కొత్త పింఛన్ లేదు..
33 నెలలుగా రాష్ట్రంలో ఒక్క కొత్త పింఛను కూడా ఇవ్వలేదని, దేశంలో 8 రాష్ట్రాల్లో ఉన్న బీడీ కార్మికులకు పింఛను ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గంప గోవర్ధన్ అన్నారు. ఇప్పుడు వారికి దరఖాస్తు చేసుకునే ఆప్షన్ కూడా ఇవ్వడం లేదన్నారు. రైతు కూలీలకు ఏడాదికి రూ.15 వేలు, కౌలు రైతులకు రూ.12 వేలు ఇస్తామన్న వరంగల్ రైతు డిక్లరేషన్ ఏమైందని ప్రశ్నించారు. చివరికి పంచాయతీల్లో పనిచేసే సిబ్బందికి కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు.
Gampa Govardhan Criticism | కేసీఆర్ ఫామ్హౌస్ మీదికి దాడికి పంపుతారా..
కేసీఆర్ ఫాంహౌస్ మీదకు దాడికి పంపుతారా, అధికారం ఉందని దౌర్జన్యం చేస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నామని, జైళ్లకు వెళ్లామని, సీఎం తాటాకు చప్పుళ్లకు భయపడబోమని స్పష్టం చేశారు. రైతులకు గుదిబండగా మారిన యూరియా యాప్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తొలగించి పాత పద్ధతిలోనే యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతులే ప్రభుత్వాలను కూల్చేస్తారని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు ముజీబోద్దీన్, నాయకులు ప్రభాకర్ రెడ్డి, కాసర్ల స్వామి, ప్రేమ్ కుమార్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Ganesh Utsav Peaceful Celebrations | ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి