అక్షరటుడే, వెబ్డెస్క్ : Mulugu Tahsildar ACB | ములుగు (Mulugu) జిల్లా గోవిందరావుపేట తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ (ACB) అధికారులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. తహశీల్దార్ సృజన్ కుమార్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
మండలంలోని ఓ గ్రామానికి చెందిన లింగాల శ్రీలత అనే మహిళ పూర్వికుల భూమి వారసత్వ బదిలీ కోసం తహశీల్దార్ సృజన్ కుమార్ రూ.15 వేల లంచం డిమాండ్ చేశాడు. అనంతరం ఆ మొత్తాన్ని రూ.14 వేలకు తగ్గించాడు. ఈ విషయాన్ని శ్రీలత భర్త ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఫిర్యాదుదారుడి నుంచి శుక్రవారం తహశీల్దార్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో సోదాలు చేపట్టారు. కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేశారు.
Mulugu Tahsildar ACB | అవినీతి కేంద్రాలుగా..
రాష్ట్రంలోని పలు తహశీల్దార్ కార్యాలయాలు అవినీతి కేంద్రాలుగా మారాయి. అటెండర్లు, ఆపరేటర్ల నుంచి మొదలు పెడితే తహశీల్దార్ల వరకు కాసుల వేటలో నిమగ్నం అవుతున్నారు. ప్రతి పనికి ఓ రేటు కడుతున్నారు. భూముల రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారి నుంచి సైతం డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఆపరేటర్ల ద్వారా పలువురు తహశీల్దార్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
దీనిని కూడా చదవండి : Danam Nagender | సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన లేదు.. దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు