అక్షరటుడే, కామారెడ్డి : Chandrasekhar Reddy Suspension | టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే కామారెడ్డి (Kamareddy) నుంచి వెయ్యి మందితో గాంధీ భవన్లో దీక్ష చేపడతామని కామారెడ్డి కాంగ్రెస్ నాయకులు సంచలన ప్రకటన చేశారు. అవసరం అయితే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని పేర్కొన్నారు.
Chandrasekhar Reddy Suspension | పార్టీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం..

కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం (Congress Party Office)లో శుక్రవారం నియోజకవర్గంలోని మండలాల అధ్యక్షులు, జిల్లా నాయకులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ వర్గ నేతలు మాట్లాడుతూ చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నత పదవుల్లో కొనసాగిన వారు డబ్బులకు అమ్ముడు పోయారన్నారు. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్లో కొనసాగుతూ బీఆర్ఎస్ కోవర్టుగా పని చేస్తున్నారని ఆరోపించారు. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఖతం కోసం ఆయన పని చేస్తున్నారన్నారు.
పార్టీని బ్రష్టు పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ (BRS)లో ఉన్నప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఛైర్మన్ను కొట్టినందుకు చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారని వారు గుర్తుచేశారు. నిజాయితీ కలిగిన షబ్బీర్ అలీపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, ఆ ఆరోపణలను నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. చంద్రశేఖర్ రెడ్డిపై తాము చేసిన ఆరోపణలకు సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు.
Chandrasekhar Reddy Suspension | గత అసెంబ్లీ ఎన్నికల్లో..

గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) మెజారిటీ తగ్గడానికి చంద్రశేఖర్ రెడ్డి వర్గమే కారణమని ఆరోపించారు. ఆయనపై ఉన్న వ్యతిరేకతే మెజారిటీ తగ్గడానికి కారణమన్నారు. వారం రోజుల్లో చంద్రశేఖర్ రెడ్డిని సస్పెండ్ చేయకపోతే సీఎం, పీసీసీ చీఫ్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్లను వెయ్యి మందితో వెళ్లి కలుస్తామని, పెద్దమొత్తంలో గాంధీభవన్లో ఆందోళన చేస్తామని, అప్పటికీ సస్పెండ్ చేయకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని అల్టిమేటం జారీ చేశారు. మున్సిపల్ ఛైర్మన్ పదవికి నాలుగు కోట్ల డీల్ జరిగిందన్న ప్రచారాన్ని ఖండిస్తూ అది అబద్ధమని కొట్టిపారేశారు.
కోవర్టులను లీడర్లను చేస్తే పార్టీకి భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. 30 ఏళ్లుగా పార్టీలో కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులుగా పని చేస్తున్న వాళ్ళు పార్టీకి కావాలా..? మూడేళ్ల క్రితం వచ్చి పార్టీని భ్రష్టు పట్టించే వాళ్ళు కావాలా తేల్చుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సందీప్, నాయకులు గూడెం శ్రీనివాస్ రెడ్డి, పట్టణ మాజీ అధ్యక్షుడు పండ్ల రాజు, రాజాగౌడ్, నౌశిలాల్, గోనె శ్రీనివాస్, పాత రాజు, భీంరెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: SI Extramarital Affair | హోంగార్డు భార్యతో ఎస్సై వివాహేతర సంబంధం..!
