అక్షరటుడే, వెబ్డెస్క్: Hyderabad Rain Havoc | హైదరాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వాన కురవడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. వర్ష బీభత్సానికి ముగ్గురు మృతి చెందారు.
రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) మీర్పేట్లో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి ఈదురుగాలుల వానకు రాఘవేంద్ర నగర్ కాలనీలో ఒక రేకుల ఇంటిపై తాటి చెట్టు కూలింది. ఈ ప్రమాదంలో సభావత్ లక్ష్మి అనే దివ్యాంగురాలు అక్కడికక్కడే మృతి చెందింది. లక్ష్మితో పాటు ఇంట్లో ఉన్న ఆమె కుమారుడు, కోడలు కూడా దివ్యాంగులే కావడంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం, విషాదాన్ని నింపింది.
Hyderabad Rain Havoc | విద్యుత్ షాక్తో తండ్రి కూతురు…
హైదరాబాద్ (Hyderabad) పాతబస్తీలో విషాదం మరవకముందే.. అల్వాల్ పరిధిలో రోడ్డుపై తెగిపడిన కరెంట్ తీగలు తగిలి కరెంట్ షాక్తో తండ్రి కూతురు మృతి చెందారు. తెల్లవారుజామున రోడ్డుపై విరిగిపడిన చెట్టు కొమ్మలు తొలగిస్తుండగా కరెంట్ షాక్ తగలడంతో సందీప్, రితిక చనిపోయారు. తమ కారుపై కొమ్మలు పడటంతో వారు తొలగించే యత్నం చేశారు. అయితే విద్యుత్ తీగలు సైతం తెగిపడడంతో అవి తగిలి ఇద్దరు షాక్ కొట్టి చనిపోయారు.
Hyderabad Rain Havoc | ఈసీ నదిలో ఉప్పొంగిన ప్రవాహం..
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షాల ప్రభావంతో చేవెళ్ల సమీపంలోని ఈసీ నదిలో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వర్షాకాల సీజన్లో ఈసీ నది పారడం ఇదే మొదటిసారి కావడంతో స్థానిక ప్రజలు, రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Hyderabad Rain Havoc | నిలిచిన విద్యుత్ సరఫరా
ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో పలుచోట్ల చెట్లు విరిగిపోయాయి. గాలులకు బోర్డులు, హోర్డింగులు ఎగిరిపోయాయి. సిటీలో చాలాచోట్ల విద్యుత్ సరఫరా నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షానికి రహదారులు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది రోడ్లపై నిలిచిన నీటిని తొలగించారు.
ఇది కూడా చదవండి..: Airport Bomb Threat | శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు
