అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Dial 112 | కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురై ఇద్దరు చిన్నారులతో సహా ఆత్మహత్యకు యత్నించిన ఓ తల్లిని కామారెడ్డి టౌన్ పోలీసులు చాకచక్యంగా కాపాడారు. పోలీస్ శోధన, సమయస్ఫూర్తి ఫలితంగా ఒక్క డయల్-112 కాల్ ముగ్గురి ప్రాణాలను నిలబెట్టింది.
Kamareddy Dial 112 | జీవితంపై విరక్తి చెంది..
లక్ష్మీదేవునిపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ కుటుంబ సమస్యల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైంది. జీవితంపై విరక్తి చెంది, తన ఐదేళ్ల కుమారుడు, మూడేళ్ల కుమార్తెతో కలిసి గురువారం సాయంత్రం రైల్వే పట్టాల వద్దకు వెళ్లింది. ఈ పసికందుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని గ్రహించిన స్థానికులు వెంటనే డయల్-112 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు.
Kamareddy Dial 112 | తక్షణం స్పందించిన పోలీసులు..
సమాచారం అందుకున్న వెంటనే కామారెడ్డి టౌన్ సీఐ నరహరి ఆదేశాలతో బ్లూకోల్ట్స్ సిబ్బంది, కానిస్టేబుల్స్ కళ్యాణ్, రామకృష్ణ హుటాహుటిన రైల్వే ట్రాక్ ప్రాంతానికి చేరుకున్నారు.
అక్కడ ఉన్న మహిళను, పిల్లలను గుర్తించిన కానిస్టేబుళ్లు ఎంతో సమయస్ఫూర్తితో ఆమెతో మాటలు కలిపారు. ఆత్మహత్య దేనికీ పరిష్కారం కాదని, సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని నచ్చజెప్పి ఆమె మనసు మార్చారు.
అనంతరం వారిని సురక్షితంగా పోలీస్ స్టేషన్కు తరలించి, కుటుంబ సమస్యలపై కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆపద సమయంలో చాకచక్యంగా వ్యవహరించి మూడు ప్రాణాలను నిలబెట్టిన కానిస్టేబుళ్లు కళ్యాణ్, రామకృష్ణలతో పాటు కామారెడ్డి టౌన్ పోలీసులను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ప్రత్యేకంగా అభినందించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు వెంటనే డయల్-112కి సమాచారం ఇవ్వాలని, ఆపదలో ఉన్న వారికి పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని ఎస్పీ పేర్కొన్నారు.