Rythu DISCOM | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావాలని చూస్తున్న ‘రైతు డిస్కం’ విధానంపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. ఈ ప్రతిపాదన వెనుక ఉన్న ప్రభుత్వ అసలు ఉద్దేశాలను, లోపాలను ఎండగట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సిద్ధమైంది. ఇందులో భాగంగానే రేపు ఉదయం 10 గంటలకు తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ERC) నిర్వహించబోయే కీలక ప్రజాభిప్రాయ సేకరణకు గులాబీ పార్టీ హాజరుకానుంది. రాష్ట్రంలోని రైతులు, సామాన్య ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా కమిషన్ ఎదుట గట్టిగా వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతోంది.
Rythu DISCOM | కేటీఆర్ బృందం హాజరు..
ఈ ఈఆర్సీ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) స్వయంగా నేతృత్వం వహించనున్నారు. ఆయనతో పాటు విద్యుత్ రంగంపై పూర్తి పట్టున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , పలువురు సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులతో కూడిన ఉన్నత స్థాయి బృందం ఈ విచారణకు హాజరుకానుంది.

Rythu DISCOM | ‘రైతు డిస్కం’తో అన్నదాతలకు ముప్పు?
కాంగ్రెస్ ప్రభుత్వం ‘రైతు డిస్కం’ ముసుగులో తెస్తున్న ఈ కొత్త విధానాల వల్ల అటు రైతులకు, ఇటు రాష్ట్ర విద్యుత్ రంగానికి పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ నిర్ణయం ద్వారా రైతులకు అందుతున్న ఉచిత విద్యుత్కు ఎసరు పెట్టేలా ప్రభుత్వ అంతర్గత వ్యూహాలు ఉన్నాయని, వీటన్నింటినీ సాక్ష్యాధారాలతో సహా ఈఆర్సీ కమిషన్ ముందు పెట్టనున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు అందించిన 24 గంటల ఉచిత విద్యుత్ హక్కుకు ఎలాంటి భంగం కలగకుండా కాపాడుకోవడమే ధ్యేయంగా రేపటి భేటీలో కేటీఆర్ టీమ్ గళం విప్పనుంది.
ఇది కూడా చదవండి: Indians in America | మా దేశంలో మీకేం పని.. అమెరికాలో భారతీయులకు అవమానం


