Singareni Bharosa Yatra | గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే భారీ బొగ్గు కుంభకోణం: కిషన్ రెడ్డి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన బీజేపీ 'సింగరేణి భరోసా యాత్ర'లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Singareni Bharosa Yatra | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన బీజేపీ ‘సింగరేణి భరోసా యాత్ర’లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ( Kishan Reddy ) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సింగరేణి సంస్థ అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ముందడుగు చర్యలను ప్రస్తావిస్తూనే, గత ప్రభుత్వాల వైఖరిపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

Singareni Bharosa Yatra | అతిపెద్ద బొగ్గు కుంభకోణం..

గత కాంగ్రెస్ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వ కాలంలో దేశంలోనే అతిపెద్ద బొగ్గు కుంభకోణం జరిగిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా చేసిన బొగ్గు గనుల కేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసిందని గుర్తు చేశారు. ఆ తర్వాత బొగ్గు గనుల కేటాయింపులు పారదర్శకంగా జరగాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని ఆయన ఈ సందర్భంగా వివరించారు.

Singareni Bharosa Yatra | తాడిచర్ల-2 బ్లాక్‌ను సింగరేణికి ..

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎటువంటి వేలం ప్రక్రియ లేకుండా సింగరేణి సంస్థకు నేరుగా కేటాయించిన ఏకైక బొగ్గు గని ‘తాడిచర్ల-2’ బ్లాక్ అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ బ్లాక్‌లో గ్రేడ్-8 నాణ్యత కలిగిన బొగ్గు లభిస్తుందని, మరో 40 నుంచి 50 సంవత్సరాల పాటు సింగరేణి సంస్థకు అవసరమైన బొగ్గు దీని ద్వారా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. తాడిచర్ల-2 బ్లాక్‌ను సింగరేణికి కేటాయించినందుకు ప్రధాని మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దీనితో పాటు ఒడిశాలోని ‘నైనీ కోల్ బ్లాక్’ను కూడా మోదీ ప్రభుత్వమే సింగరేణికి కేటాయించిందని గుర్తు చేశారు.

kishan reddy.1 1

Singareni Bharosa Yatra | బీఆర్ఎస్ అహంకారపూరిత నిర్ణయాలు..

సింగరేణి సంస్థకు మరిన్ని బొగ్గు బ్లాకులు అవసరమని, దీనికి సంబంధించిన సమస్యలను తాను అనేకసార్లు ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లానని కిషన్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతం సింగరేణి ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకారపూరిత నిర్ణయాలు, సింగరేణిని కేవలం ఒక ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడమే సంస్థ పరిస్థితి ఇలా దిగజారడానికి కారణమని విమర్శించారు. పదేళ్లపాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణికి చేసిన మేలు ఏమిటో ప్రజలకు చెప్పాలని సవాల్ విసిరారు. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ కేటాయింపుపై కేసీఆర్ ఎప్పుడూ మాట్లాడలేదని ఎద్దేవా చేశారు.

Singareni Bharosa Yatra | రూ. 24 వేల కోట్ల బకాయిలు..

సింగరేణి సంస్థకు ఇవ్వాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. సింగరేణి నుంచి తీసుకున్న బొగ్గు, విద్యుత్ బకాయిలను చెల్లించకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంస్థకు సుమారు రూ. 24 వేల కోట్ల భారీ అప్పు పెట్టిందని ఆరోపించారు. సింగరేణి సంస్థలో రాష్ట్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉన్నప్పటికీ, బీఆర్ఎస్ , కాంగ్రెస్ ప్రభుత్వాలు సంస్థ అభివృద్ధి కోసం కేంద్రాన్ని సమర్థవంతంగా సంప్రదించలేదని మండిపడ్డారు. ఈ రెండు పార్టీలు సింగరేణిని కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించుకున్నాయని కిషన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.

ఇది కూడా చదవండి:  Banakacharla Project | తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *