అక్షరటుడే, వెబ్డెస్క్ : Urea Supply | ఎరువుల పంపిణీలో పారదర్శకత, వేగం పెంచేందుకు అన్ని రకాల ఫెర్టిలైజర్లను యాప్ ద్వారా బుక్ చేసే విధానం తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. యాప్ ద్వారా రైతులు బుక్ చేసుకున్న యూరియాను రైతు వేదికల ద్వారా పంపిణీ చేయాలని సూచించారు. యూరియా పంపిణీ బాధ్యతను జిల్లా అదనపు కలెక్టర్లకు అప్పగించాలన్నారు.
వర్షాలు, వానాకాలం సాగు సీజన్కు సంబంధించి సీఎం మంగళవారం అధికారులతో సమీక్షించారు. ఖరీఫ్ సీజన్కు అవసరమైన యూరియా, ఇతర ఎరువుల కేటాయింపులపై ఎప్పటికప్పుడు కేంద్రానికి లేఖలు రాయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సూచించారు. అవసరమైతే మంత్రులు, ఎంపీల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని చెప్పారు.
Urea Supply | నష్టాలు తగ్గించాలి

మార్క్ఫెడ్ (Markfed) నష్టాలను తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. వ్యాపారులకు తలొగ్గకుండా ఈ సారి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించిన కారణంగా మొక్కజొన్న కొనుగోళ్లతో వచ్చే నష్టం తగ్గించగలిగామని పేర్కొన్నారు. గతంలో రూ. 13 వేలకు టన్ను అమ్మిన పరిస్థితి ఉందని, ఈసారి దాదాపు రూ. 21 వేలకు పైగా టెండర్ రేట్ వచ్చిందని వెల్లడించారు.
Urea Supply | ప్రణాళికతో..
రైతులకు విత్తనాల సరఫరా నుంచి పండించిన పంట ఉత్పత్తుల కొనుగోళ్ల వరకు సమగ్ర ప్రణాళికతో పాటు నిర్దిష్ట కార్యాచరణ అమలు చేయాలని ముఖ్యమంత్రి అదేశించారు. పంట వేసినప్పటి నుంచే రైతులు, పంటల వివరాల రికార్డులు, దిగుబడి అంచనాలు, ధాన్యం కొనుగోళ్ల వరకు ప్రతి దశలో వ్యవసాయ శాఖకు పూర్తి అవగాహన ఉండాలని స్పష్టం చేశారు. రైతులు ఎక్కడా ఇబ్బంది పడకుండా వచ్చే సీజన్ నుంచే కొనుగోళ్లు సాఫీగా జరిగేలా ఇప్పుడే ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
Urea Supply | సన్నాలకు బోనస్
సన్న వడ్లు పండించే రైతులకు బోనస్ ఇస్తున్న నేపథ్యంలో 7 రకాల సన్న వడ్ల విత్తనాలను అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ విత్తనాలను సబ్సిడీపై రైతులకు ఇవ్వాలన్నారు. రైతు వేదికల్లోనే సన్న వడ్ల విత్తనాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. సన్న వడ్లు పండించే రైతుల పూర్తి డేటా సేకరించాలి. ప్రతి రైతు వేదిక వద్ద వ్యవసాయ శాఖతో పాటు రెవెన్యూ, పోలీస్ విభాగాల నుంచి ఒక్కో అధికారి అందుబాటులో ఉండాలన్నారు.
దీనిని కూడా చదవండి : Land Survey Deputy Director | భూ సర్వే శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఇంట్లో నోట్ల కట్టలు..