అక్షరటుడే, కామారెడ్డి: Indiramma Houses Progress | రెండేళ్లలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతి లేకపోతే ఎలా అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) అధికారులను ప్రశ్నించారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమావేశం శుక్రవారం కామారెడ్డి పట్టణంలోని సత్య కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు.
Indiramma Houses Progress | అధికారుల మధ్య సమన్వయలోపం..
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. అధికారుల మధ్య సమన్వయ లోపం, సమస్యలుంటే తమ దృష్టికి తేవాలన్నారు. అంతే తప్ప సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు (Indiramma Houses) ఇసుక మొరం తెస్తే లబ్ధిదారులను పట్టుకుని దొంగలను మాత్రం వదిలేస్తున్నారని ఆరోపించారు. లబ్ధిదారులు చెరువులో నుంచి మొరం తెచ్చుకుంటే వాటికి పైసలు ఇవ్వాలా అని ప్రశ్నించారు. కొద్దిరోజులు అయితే వర్షాలు పడతాయని, ఆ తరువాత ప్రజలు వెళ్లమన్నా వెళ్లరని పేర్కొన్నారు. ఇలాంటి ఫిర్యాదులు మరోసారి వస్తే సహించేది లేదని పోలీసులకు హెచ్చరించారు. మున్సిపల్ కార్మికులకు సీఎం జీతాలు పెంచుతూ నిర్ణయించడం అభినందనీయమని, అదే సమయంలో పంచాయతీ కార్మికులకు కూడా జీతాలు పెంచాలని సీఎంను కోరతానన్నారు.
Indiramma Houses Progress | కామారెడ్డి మున్సిపాలిటీలో పన్ను వసూళ్లు..
కామారెడ్డి మున్సిపాలిటీలో (Kamareddy Municipality) పన్ను వసూళ్లు తగ్గాయని, వాటిపై దృష్టి పెట్టాలని సూచించారు. కామారెడ్డికి త్వరలో తాగునీటి సమస్య పరిష్కారం కాబోతోందని, ప్రస్తుతం 10 ఎంఎల్డీ వాటర్ వస్తున్నాయని, త్వరలో 14 ఎంఎల్డీ వాటర్ రాబోతున్నాయన్నారు. కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం ఎక్కడికక్కడ ఆగిపోయాయన్నారు. గోదాముల ఖాళీ లేవని, ఖాళీ ఉంటే లేబర్ సమస్య ఉంటుందని, లేబర్ ఉంటే హమాలీలు ఉండడం లేదని, అన్నీ ఉంటే లారీలు దొరకడం లేదన్నారు. గత సీజన్లో జిల్లాలో 3.80 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం వస్తే ఈసారి 4 లక్షలకు చేరిందన్నారు.
వీలున్న చోట పంట మార్పిడి చేయాలని సూచించారు. మాచారెడ్డి, రామయంపేట్లో తన సొంత భూమిలో వచ్చే సీజన్ నుంచి ఆయిల్ పామ్ సాగు చేస్తానని షబ్బీర్ అలీ తెలిపారు. జొన్న పంట కూడా గతంలో కంటే దిగుబడి పెరిగిందని పేర్కొన్నారు. గతంలో కామారెడ్డిలో చెరుకు పండేదని, ఇప్పుడు అది కనిపించడం లేదన్నారు. వరిధాన్యం పండించవద్దని తాను చెప్పడం లేదని, లాభసాటి పంటలపై దృష్టి పెట్టాలని సూచించారు. అనంతరం ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పని చేసిన అధికారులకు ఉత్తమ పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు, గ్రంథాలయ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, ఆయా శాఖల అధికారులు, మున్సిపల్ ఛైర్మన్లు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Bhagavata Saptaham | పోతంగల్లో వైభవంగా ‘శ్రీమద్భాగవత మహాపురాణ’ సప్తాహం


