అక్షరటుడే వెబ్డెస్క్: Sridhar Babu | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy )యువతలాగే ఆలోచిస్తారని, జెన్-జీ (Gen-Z) తరంతో పోటీ పడే ఆలోచనా ధోరణి ఆయన సొంతమని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మీడియాతో జరిగిన చిట్చాట్లో ఆయన పలు రాజకీయ, సమకాలీన అంశాలపై మాట్లాడారు. తమ ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్లో 90 శాతం మంది జెన్-జీ యువతే ఉన్నారని ఆయన తెలిపారు.
Sridhar Babu | నీట్ వివాదంపై వ్యాఖ్యలు..
విద్యార్థుల నిరసనలు కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అని మంత్రి అభివర్ణించారు. నీట్ అనేది కోట్లాది మంది విద్యార్థుల సమస్య అని, ఇందులో మధ్యతరగతి కుటుంబాలు కూడా పెద్దఎత్తున భాగస్వామ్యమయ్యాయని చెప్పారు. ఆన్లైన్ ఉద్యమం ప్రారంభమైనప్పటికీ, ఆ నినాదాన్ని రాహుల్ గాంధీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారని తెలిపారు. రాహుల్ గాంధీ ఏకంగా ప్రధాని ఇళ్ల ముందు ధర్నా చేయడంతోనే ఈ ఉద్యమం పీక్స్కు వెళ్లిందని, ఈ నిరసనలు విస్తరించడానికి కాంగ్రెసే కారణమని స్పష్టం చేశారు. మరోవైపు, మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను సన్మానించడం బీజేపీ మనస్తత్వాన్ని ఎత్తిచూపుతోందని విమర్శించారు. తెలంగాణ కేబినెట్ విస్తరణపై మాట్లాడుతూ.. మంత్రివర్గంలో ఎలా ఉండాలనేది ఏఐసీసీ నిర్ణయిస్తుందని చెప్పారు.
Sridhar Babu | బీఆర్ఎస్ తీరుపై విమర్శలు..
కేవలం పీఆర్ స్టంట్లు చేసుకుంటూ పోయిన బీఆర్ఎస్ గతి ఏమైందో అందరూ చూశారన్న శ్రీధర్ బాబు.. తాము మాత్రం ప్రమోషన్ల గురించి పట్టించుకోకుండా నిశ్శబ్దంగా పని చేసుకుంటూ వెళ్తామని చెప్పారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై మహారాష్ట్ర ముఖ్యమంత్రితో సంప్రదింపులు జరుగుతున్నాయని, త్వరలోనే సీఎం రేవంత్తో చర్చించి రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకు వెళ్తామన్నారు. బెంగళూరును తలదన్నేలా అంతర్జాతీయ స్థాయి కంపెనీలు (GCCS) హైదరాబాద్కు తరలివస్తున్నాయని, ఇది తమ ప్రభుత్వ విజయమని చెప్పారు. ఈ సంవత్సరం వంద కంపెనీలను రప్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే 40 కంపెనీలు వచ్చాయని వెల్లడించారు.
Sridhar Babu | హైడ్రాపై బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు..
హైడ్రా వ్యవస్థ చాలా మంచిదని సాధారణ ప్రజలే చెబుతున్నారని, దీనికి మద్దతుగా ప్రజలు స్వచ్ఛందంగా ర్యాలీలు తీస్తున్నారని మంత్రి తెలిపారు. హైడ్రా విషయంలో న్యాయస్థానం ఇచ్చే తుది తీర్పును గౌరవిస్తామని, ప్రభుత్వ వాదనను కోర్టు ముందు గట్టిగా వినిపిస్తామన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే కొందరు వ్యతిరేక పిటిషన్లు వేస్తున్నారని, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి హైడ్రాపై కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. కోర్టు నుంచి పూర్తి స్థాయి తీర్పు రాకముందే బీఆర్ఎస్ పార్టీ మీడియా, సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: MP Arvind | విద్యార్థులను మోసం చేస్తున్న ప్రభుత్వం : ఎంపీ అర్వింద్