అక్షరటుడే, వెబ్డెస్క్ : Harish Rao Devadula | వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నా.. ప్రభుత్వం దేవాదుల నుంచి నీటిని ఎత్తిపోయకుండా దిగువన ఏపీకి వదిలి పెడుతోందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
మంత్రులు ఇటీవల దేవాదుల ప్రాజెక్ట్ను సందర్శించారని హరీశ్రావు (Harish Rao) గుర్తు చేశారు. 10 మోటార్లు ఆన్ చేసి నీటిని ఎత్తిపోస్తామని ప్రకటించారన్నారు. మంత్రులు వెళ్లిన రోజు 7 మోటార్లు నడిపించారని, తర్వాత నుంచి 5 మోటార్లే ఆన్ చేశారన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం 10 మోటార్లు ఆన్ చేసి 22 రిజర్వాయర్లు నింపి, 38 టీఎంసీల నీళ్లు ఎత్తుతామని చెప్పారన్నారు. వీళ్ళ మాటలు నమ్మి రైతులు నారు మళ్లు పోసుకున్నారని, ఇప్పుడు ఏమో నీళ్లు ఇవ్వడం లేదన్నారు. నీళ్లు లేకపోవడంతో నారు ముదిరిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
Harish Rao Devadula | ప్రభుత్వం నిర్లక్ష్యంతో..
నీటి పారుదల శాఖ మంత్రికి దేవాదుల కింద ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయో తెలియదని ఎద్దేవా చేశారు. సాగునీటి కోసం రైతులు ధర్నా చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సమ్మక్క బ్యారేజీలో నీరు ఉందని, వరద వస్తుందన్నారు. అయినా కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఎత్తిపోయడం లేదని హరీశ్రావు విమర్శించారు. పది మోటార్లు ఉన్నా.. ఐదు మోటార్లే ఎందుకు నడుపుతున్నారని ప్రశ్నించారు. కరువు వచ్చి రైతులు ఇబ్బందులు పడుతుంటే.. ప్రభుత్వం చంద్రబాబు కోసం కిందకు నీళ్లు వదులుతోందన్నారు.
Harish Rao Devadula | కాంగ్రెస్ తెచ్చిన కరువు
ఎల్నినో వస్తుందని ఆరు నెలల ముందు నుంచే వాతావరణ నిపుణులు చెబుతున్నా.. ప్రభుత్వం సన్నద్ధం కాలేదన్నారు. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయమంటే ఎన్డీఎస్ఏ పేరు చెబుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం.. దేవాదుల నుంచి ఎందుకు లిఫ్ట్ చేయడం లేదని హరీశ్రావు ప్రశ్నించారు. మంత్రులు నీళ్లు ఇస్తామని చెబుతుంటే.. కలెక్టర్ ఏమో ఇవ్వమని చెప్పి తూములు మూసివేశారన్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అన్నారు.
Harish Rao Devadula | 1.9 టీఎంసీలే..
ఓట్లు, తిట్ల మీద ఉన్న సోయి నీళ్ల మీద పెట్టాలని సీఎం రేవంత్రెడ్డికి హరీశ్రావు సూచించారు. బీఆర్ఎస్ను ఆపుతా అనే సీఎం ముందు నీళ్లను ఆపాలని సూచించారు. ‘బీఆర్ఎస్ను ఆపాడం మీ తాత తరం కాదు’ అని వ్యాఖ్యానించారు. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు సమ్మక్క బ్యారేజీ నుంచి 105 టీఎంసీలు దిగువకు వదిలేశారన్నారు. 1.9 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోశారని తెలిపారు. 12 టీఎంఎసీలు ఎత్తిపోసే అవకాశం ఉన్నా.. ప్రభుత్వం 2 టీఎంసీలు కూడా ఎత్తిపోయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి..: BC Gurukul Inspection | అన్ని గురుకులాలను తనిఖీ చేయాలి : మంత్రి పొన్నం